డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి తెప్పోత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతసేవ, వేదపండితులు పూజలు ప్రారంభించారు. అర్చన, మంత్రపుష్పం, నైవేద్యం, సేవాకాలం, భక్తుల దర్శనాలు, తులసి అర్చన పూజలు చేశారు. యాగశాల పూజలు, విశేష హోమాలు, నీరాజనం, మంత్రపుష్పం పూజలు నిర్వహించారు. లక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన పూజ చేశారు. అనంతరం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో పూలు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి హంస వాహనంపై స్వామివారు శ్రీదేవి, భూదేవి సమే తంగా విహరించారు. చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డి తదితరులు తెప్పోత్సవంలో భాగంగా పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


