● పరీక్షలు సజావుగా నిర్వహించాలి ● ఎస్ఎస్సీ పరీక్షల రాష్ట్ర పరిశీలకురాలు తహేరా సుల్తానా
విజయనగరం అర్బన్: పదవ తగరతి పబ్లిక్ పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఎస్ఎస్సీ పరీక్షల రాష్ట్ర పరిశీలకురాలు తహేరా సుల్తానా జిల్లా స్థాయి స్క్వాడ్ బృందాలతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రెవెన్యూ, విద్యా శాఖ, పోలీస్ శాఖల అధికారులతో కూడిన స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి. పరీక్ష కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర పరిశీలకురాలు సమీక్షించి, పరీక్ష లు నిష్పక్షపాతంగా, క్రమశిక్షణతో నిర్వహించేందు కు అవసరమైన సూచనలు అధికారులకు అందించారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. స్క్వాడ్ బృందాలు పరీక్ష కేంద్రాలను నిరంతరం తనిఖీ చేస్తూ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. విద్యా శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రెవెన్యూ, విద్యా శాఖ అధికారు లు కేంద్ర సూపరింటెండెంట్లతో సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వహణను సమర్ధవంతంగా పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, పరీక్షల కమిషన ర్ టి.సన్యాసిరాజు తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
విజయనగరం క్రైమ్ : జిల్లాలో టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కేంద్రాలకు తీసుకురాకూడదని పేర్కొంది. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు తెలిపాయి.


