గుండెపోటుతో ‘ఉపాధి’ వేతనదారు మృతి
గుర్ల: మండలంలోని కలవచర్లకు చెందిన ఉపాధిహామీ వేతనదారు రౌతు వెంకటరమణ (66) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. వివరాల్లోకి వేళ్తే.. గ్రామంలో ఇంకుడు గుంతలు తవ్వేందుకు శనివారం వెళ్లాడు. ఉపాధి హమీ పనిచేస్తుండగా ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో తోటి కూలీలకు చెప్పి ఇంటి బాటపట్టాడు. ఇంటి వద్దకు చేరుకోగానే హఠత్తుగా గుండె నొప్పి ఎక్కువ కావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందాడు. మృతినికి భార్య మంగమ్మ ఉన్నారు.
ఇదేం‘పని’...
కలవచర్లలో శనివారం నిర్వహించిన ఉపాధిహామీ పనుల్లో 120 మంది పాల్గొన్నారు. అయితే, వీరిలో 44 మంది వేతనదారుల మస్తర్లు నమోదుచేయలేదు. నమోదుకానివారిలో మృతుడు రౌతు వెంకటరమణ కూడా ఉన్నాడు. విషయం తెలుసుకున్న వేతనదారులు ఇదేంపని అంటూ మేట్లు, ఫీల్డు అసిస్టెంట్ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మస్తరు వేయకుండా వెంకటరమణ మృతిని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేతనదారు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఏపీఓ రత్నమాల వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఉపాధిహమీ వేతనదారుడు వెంకటరమణ మృతి చెందినట్లు తెలిసిందని, దీనిపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానన్నారు.


