మహారాణిపేట: రాష్ట్రంలో అత్యధిక ఓటర్లున్న జిల్లాల్లో విశాఖపట్నం ఒకటని, ఇక్కడ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు, ఈఆర్వోలతో సమావేశమై ఎస్ఐఆర్ పురోగతి, ఈఎఫ్ పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఈఆర్వోలు పారదర్శకంగా వ్యవహరించాలని, అర్హుల ఓటు తొలగిపోకుండా, అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను సహేతుకంగా నిర్వహించాలన్నారు. సర్ ప్రక్రియలో వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. డిజిటలైజేషన్ను వేగవంతంగా పూర్తి చేయాలని అండర్ సెక్రటరీ సంజయ్కుమార్ సూచించారు.


