డాబాగార్డెన్స్ : ఈ నెల 20న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా భక్తుల కోసం 70 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన సింహాచలం డిపోలో ఏర్పాట్లను తనిఖీ చేశారు. కొండపైకి వెళ్లే బస్సులకు ప్రత్యేక మెకానికల్ టీమ్స్ ద్వారా ముందస్తు తనిఖీలు నిర్వహించి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చందనోత్సవం రోజున తెల్లవారుజాము నుంచే ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


