మహారాణిపేట: విశాఖ జిల్లాకు ఉన్న కీర్తి ప్రతిష్టలకు తగ్గట్టుగా వినూత్న రీతిలో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని, ఇందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల, వివిధ విభాగాల సమన్వయంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని సమాచారం, సమస్యలు, పురోగతిని నేరుగా తనకే తెలియజేయా లని సూచించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కమ్యూనికేషన్ కొనసాగించాలని, అవసరమైతే ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని పేర్కొ న్నారు. అధికారుల పని సమయాల్లో 40 శాతం సాధారణ విధులకు, మిగిలిన 60 శాతం సమయాన్ని జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, వినూత్న ప్రాజెక్టుల కోసం వెచ్చించాలని సూచించారు. ప్రభు త్వ ప్రాధాన్యతలే మనందరి ప్రాధాన్యతలు కావాలని, ఆశించిన ఫలితాలను ముందుగానే అంచనా వేసి సిద్ధంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై వేగంగా స్పందించాలని స్పష్టం చేశారు. వైద్య రంగంలో డీఎంహెచ్వో, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్, డ్రగ్ ఇన్ స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ విభాగాల మధ్య సమన్వయం పెరగాలని ఆదేశించారు. ప్రజల నుంచి ప్రతికూల స్పందన రాకుండా ప్రతి ఫిర్యాదును నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, లేని పక్షంలో తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. బ్యాంక్ లింకేజీని పెంచాలని, పరిశ్రమలు, రాయితీలపై అవగాహన కల్పించాలని సూచించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ పెంచేలా విశాఖ నుంచి ఏసీ బస్సు సర్వీసులను నడపాలని, దీనిపై అధ్యయనం చేయాలని ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు. దక్షిణ నియోజకవర్గంలో రైతు బజార్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులందరూ ఒక బృందంగా పనిచేసి విశాఖను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీఎఫ్వో రవీందర్ ధామ, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్


