మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల చరిత్రను, విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేయాలంటే ఆ చరిత్రను గ్రంథస్తం చేయాలని రాజ్యసభ పూర్వ సభ్యుడు, విశ్వ హిందీ పరిషత్ చైర్మన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సూచించారు. ఏయూ తెలుగు శాఖ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవారం శ్రీ రామినేని కోదండరామయ్య భవనంలో శతాబ్ది సాహితీ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రతిష్ట, విశిష్టత, ముఖ్య ఘట్టాలను ప్రతిబింబించేలా ప్రత్యేక మ్యూజియంను ఏర్పాటు చేయా లని సూచించారు. దీని ద్వారా భవిష్యత్ తరాలకు విశ్వవిద్యాలయం స్థాపన, ప్రగతి, వికాసం గురించి సమగ్ర అవగాహన కలుగుతుందన్నారు. వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం త్వరలోనే మరో శతాబ్దంలోకి అడుగుపెడుతుందని తెలిపారు. తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్ర అప్పారావు తెలుగు శాఖ గొప్పదనాన్ని, భాషా, సాహిత్య రంగాలకు విభాగం అందించిన సేవలను వివరించారు. ప్రముఖ కవులు అట్టాడ అప్పల నాయుడు, తల్లావజ్జల పతంజలి శాస్త్రి, తెలుగు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఆచార్య నల్లా సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. అనంతరం విభాగ విశ్రాంత ఆచార్యులు పర్వతనేని సుబ్బారావు, జి.యోహాన్ బాబు, వెలమల సిమ్మన్న, ఆచార్య కె.మలయవాసిని లను సత్కరించారు. తెలుగు సాహిత్య వికాసానికి విశిష్ట సేవలు అందిస్తున్న కవులు, రచయితలు, గాయనీ గాయకులను సన్మానించారు.


