శిల్పారామం వేదికగా ప్రతిరోజూ ఉదయం ఒక గంట సమయాన్ని మా ఆరోగ్యం కోసం కేటాయిస్తాం. మాలో చాలామంది వాకింగ్కే తొలి ప్రాధాన్యత ఇస్తారు. శారీరక వ్యాయామం పూర్తయిన తర్వాత, మానసిక ప్రశాంతత కోసం అందరం కలిసి ‘పాటల పందిరి’లో సేదతీరుతాం. ఇక్కడి వాతావరణం మాకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. – కృష్ణయ్య, వాకర్స్ సభ్యులు , పీఎంపాలెం
మధురానుభూతి ఇస్తోంది
శిల్పారామం (జాతర) ప్రశాంత వాతావరణం వల్లే 75 ఏళ్ల వయసులోనూ నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. మా ఇల్లు దూరమైనా సరే, ఇక్కడికి రావడం నాకు ఇష్టం. ముఖ్యంగా తోటి సభ్యులందరి మధ్య పుట్టినరోజు జరుపుకోవడం, అందరూ కలిసి శుభాకాంక్షలు చెప్పడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అందరి నడుమ జరిగే ఈ వేడుక నాకు ఒక మధురానుభూతి. –అంజలి, వాకర్స్ సభ్యురాలు ఎండాడ.
అందరికీ సమాన ప్రాధాన్యం
మా అసోసియేషన్లో సభ్యులందరినీ సమానంగా గౌరవిస్తూ, 2012 నుంచి సామూహిక పుట్టినరోజు వేడుకలను నిరాటంకంగా నిర్వహిస్తున్నాం. ప్రతి నెలా మొదటి ఆదివారం జరిగే ఈ వేడుకకు సభ్యులందరూ ఉత్సాహంగా హాజరవుతారు. సమష్టి వేడుకలతో పాటు, ఆసక్తి ఉన్న వారికి వ్యక్తిగత పుట్టినరోజు వేడుకలను కూడా ప్రత్యేకంగా జరిపిస్తుంటాం.
– పీవీ రామారావు, జాతర వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు.


