పేదల ప్రగతికి బ్యాంకులు విరివిగా రుణాలివ్వాలి
మహారాణిపేట : పేదల ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (బ్యాంకర్ల సమావేశం)లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల మేరకు ఔత్సాహికులకు రుణ సదుపాయాలు కల్పించాలని బ్యాంకర్లను కోరారు. విద్యా రుణాలు, ఎంఎస్ఎంఈలు, పీఎం స్వానిధి, ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కింద రుణాలు విస్తృతంగా ఇవ్వాలన్నారు. పీఎంఈజీపీ రుణాల లక్ష్యాలను అన్ని బ్యాంకులు సాధించాలని సూచించారు. టిడ్కో గృహాలకు పెండింగ్లో ఉన్న రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని ఆదేశించారు. మార్చి 8న మహిళా దినోత్సవం నాటికి ఎంఎస్ఎంఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి గ్రౌండింగ్ చేయాలని సూచించారు.
సైబర్ మోసాలపై అప్రమత్తత: రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఖాతాదారులు మోసాలకు గురికాకుండా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాకు రూ.74,317 కోట్ల రుణ ప్రణాళిక లక్ష్యం కాగా, రూ.81 వేల కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసి 110 శాతం సాధించామని తెలిపారు. సమావేశంలో బ్యాంకులు, నాబార్డ్, ఆర్బీఐ, డీఆర్డీఏ, యూసీడీ, పరిశ్రమల శాఖ, వ్యవసాయ, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.


