హెల్మెట్ భారం కాదు.. రక్షణ
మద్దిలపాలెం: నగర ప్రజల్లో హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘హెల్మెట్ ఫర్ లైఫ్’ బైక్ ర్యాలీని మంగళవారం నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఏయూ పరిపాలనా భవనం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ.. సిరిపురం కూడలి, ఆల్ ఇండియా రేడియో, ఆర్కే బీచ్ మీదుగా ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాన్ని చేపట్టిన ఏయూ యాజమాన్యాన్ని అభినందించారు. నగరంలో ‘నో హెల్మెట్.. నో ఫ్యూయల్’ నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరిస్తే తలకు గాయాలయ్యే ప్రమాదాన్ని 88 శాతం వరకు, మరణాలను 40 శాతం వరకు అరికట్టవచ్చన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చునే వారు కూడా నాణ్యమైన హెల్మెట్ను విధిగా, సరైన విధానంలో ధరించాలని సూచించారు. వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమాజాన్ని అనుసంధానం చేసేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య జాలాది రవి, కె.సీతామాణిక్యం, డి.నగరాజ కుమారి, జి.గిరిజా శంకర్, విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య ఎస్.హరనాథ్, పలువురు డీన్లు, అధికారులు, ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీపీ శంఖబ్రత బాగ్చి
హెల్మెట్ భారం కాదు.. రక్షణ
హెల్మెట్ భారం కాదు.. రక్షణ


