ఆపరేషన్ లంగ్స్ 3.0 ప్రారంభం
సెల్లార్లలో ఆక్రమణల
తొలగింపు
జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్
ప్రభాకరరావు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ‘ఆపరేషన్ లంగ్స్ 3.0’ కార్యక్రమాన్ని చేపట్టింది. కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగరంలోని వివిధ జోన్లలో సెల్లార్లు, స్టిల్ట్ ఫ్లోర్లలో వెలిసిన అక్రమ నిర్మాణాలను సోమవారం టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల సహకారంతో తొలగించారు. ఈ వివరాలను జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు వెల్లడించారు. వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లలో పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాలను ఇతర వ్యాపార అవసరాలకు వాడుతుండటంతో, వాహనదారులు రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారని, దీనివల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోందని సీసీపీ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికే మూడో విడత ఆపరేషన్ లంగ్స్ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మొదటి రోజున నాలుగు జోన్ల పరిధిలో మొత్తం 7 ఆక్రమణలను నేటమట్టం చేశామని చెప్పారు. ఇందులో డాబాగార్డెన్స్లో ఒక కమర్షియల్ షాపు, ఎంవీపీ కాలనీ సెక్టార్–1లో ఒక వాణిజ్య దుకాణం, పశ్చిమ నియోజకవర్గం గవరవీధిలో రెండు కూరగాయల దుకాణాలు, బుచ్చిరాజుపాలెం మెయిన్ రోడ్డు వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన గ్రిల్స్, గాజువాక జోన్ మెయిన్ రోడ్డులోని లక్కీ షాపింగ్ మాల్ వద్ద తాత్కాలిక టైలరింగ్ షాపు, జీవీఆర్ షాపింగ్ మాల్ వద్ద అక్రమ షట్టర్లు, గోడలను తొలగించామన్నారు.
స్వచ్ఛందంగా తొలగించుకోవాలి
పార్కింగ్ స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు వెంటనే తమ ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సీసీపీ ప్రభాకరరావు హెచ్చరించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది, పోలీస్ బలగాలు పాల్గొన్నారు.


