సూసైడ్ నోటి రాసి, యువకుడి ఆత్మహత్య
దోమ: ‘నాకు బతకాలని లేదు. అందుకే చనిపోతున్నా.. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. అమ్మ జాగ్రత్త’ అని పేర్కొంటూ ఓ యువకుడు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వసంత్ యాదవ్ తెలిపిన వివరా ల ప్రకారం.. దోమ మండల పరిధి మోత్కూరు గ్రామానికి చెందిన గుణిగారి గాలమ్మ, రామయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతు ర్లు. ఇంటి పెద్ద రెండేళ్ల క్రితం మృతి చెందగా.. చిన్న కుమారుడు వెంకటేశ్(23) మానసిక వికలాంగుడు. సోమవారం ఎప్పటిలాగే ఇంటికి వచ్చిన అతను.. భోజనం అనంతరం రాత్రి ఓ గదిలో పడుకున్నాడు. ఉదయాన్నే లేచిన తల్లికి.. కుమారుడు లేవలేదని డోర్ వద్దకు వెళ్లి పిలిచింది. కానీ అతని నుంచి సమాధానం లేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె ఇరుగుపొరుగును పిలిచింది. వారు అనుమానంతో తలుపు విరగగొట్టగా.. వెంకటేశ్ ఫ్యాన్కు వేళాడుతూ.. విగతజీవిగా కనిపించాడు. అతని జేబులో సూసైడ్ లెటర్ లభించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పరిగి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


