● పరిగి డీఎస్పీ శ్రీనివాస్
● మల్లెమోనిగూడలో తనిఖీలు
● సరైన పత్రాలు లేని పలు వాహనాల సీజ్
పరిగి: నేరాల నియంత్రణకే కార్డెన్సర్చ్ నిర్వహిస్తున్నామని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడలో గురువారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో 160 మంది పోలీసులు పాల్గొని సరైన పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, ఒక కారుతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన 39 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను పాపులేషన్ డివిజన్ మెథడ్తో పాటు ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా తనిఖీ చేశామన్నారు. గ్రామంలో, పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాలు జరగకుండా ఉండేందుకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించారు. ప్రతీ వ్యాపారి, గ్రామ ప్రజాప్రతినిధులు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కెమెరా పది మంది పోలీసులతో సమానమన్నారు. ఎలాంటి ఘటన జరిగినా కేసుల దర్యాప్తుతో పాటు నిందితులను పట్టుకునేందుకు ఇవి ఎంతో కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ మహ్మరిపై అప్రమత్తంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. వాహనదారులు విధిగా రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి, కొడంగల్ సీఐలు కొండల్రెడ్డి, శ్రీధర్రెడ్డి, ఎస్ఐ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


