● అర్హులు విధిగా ఓటు హక్కు పొందాలి
● 25 నుంచి ఇంటింటి గణన
● కలెక్టర్ దీపక్ తివారి
● వికారాబాద్లో ఎస్ఐఆర్పై 2కే రన్
అనంతగిరి: అర్హులు విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ యువత చేతిల్లోనే ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సచించారు. జూన్ 25 నుంచి జూలై 26వ తేదీ వరకు ఇంటింటి గణన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ ఎస్ఐఆర్పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, జిల్లా యువజన క్రీడల విభాగం అధికారి సత్తార్, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నేమత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
భూ సేకరణ పూర్తి చేయండి
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూ సేకరణ చేపట్టాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో రేడియల్ రోడ్, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ కోసం సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ అభివృద్ధి నిమిత్తం సేకరణ చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనలల కలెక్టర్ వెంకటాచారి, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డీఓలు వాసుచంద్ర, అనిత, తహసీల్దారు పాల్గొన్నారు.
వేగవంతం చేయండి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మొదటి విడత ఇళ్ల పురోగతిపై సమీక్ష చేశారు. ఇళ్లు మంజూరైన వారు త్వరితగతిన పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ దశరథ్ సింగ్, డిప్యుటీ ఈఈ ముక్రం బాబా, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
‘సీజనల్’పై అప్రమత్తంగా ఉండండి
పూడూరు: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దీపక్ తివారి వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. బుధవారం పూడూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, డీఎంహెచ్ఓ సుధాకర్లాల్ తదితరులు పాల్గొన్నారు.


