మూడు నెలలుగా తిరుగుతున్నా
బొంరాస్పేట: బ్యాంక్ మేనేజర్ తీరును నిరసిస్తూ గురువారం ఖాతాదారులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎస్బీఐలో సాలిండాపూర్, మదన్పల్లి, కొత్తూరు తదితర గ్రామాలకు చెందిన పలువురికి అకౌంట్లు ఉన్నాయి. వారి ఖాతాలు హోల్డ్లో పడటంతో డబ్బులు డ్రా చేసుకోలేక పోతున్నారు. దీనిపై బ్యాంక్ మేనేజర్ సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ ఖాతాల్లో డబ్బులు ఉన్నా ఇవ్వడం లేదని ఆరోపించారు. మూడు నెలలుగా ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై బ్యాంక్ అధికారులను అడిగితే సైబర్ ఫ్రాడ్ సస్పెక్టెడ్/మనీ మ్యూట్లో ఉన్నందున మీ ఖాతాల్లోని డబ్బు తీసుకోవడం సాధ్యం కాదని చెప్పినట్లు తెలిపారు. అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. ఖాతాదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఉద్యమం చేపడతామని సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. అనంతరం బ్యాంక్ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కోశాధికారి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
బ్యాంక్ మేనేజర్ తీరుపై ఆగ్రహం
బంధువుల పెళ్లికి సంబంధించిన రూ.48 వేలు బ్యాంకులో ఉంచాం. డ్రా చేసేందుకు మూడు నెలలుగా తిరుగుతున్నా. ఏవేవో కారణాలు చెబుతున్నారే తప్ప డబ్బు ఇవ్వడం లేదు. చేసేదేమీ లేక వడ్డీ కడుతున్నా.
– సూర్తిబాయి, మాలకుంటతండా


