కొడంగల్: మున్సిపల్ పరిధిలోని గుండ్లకుంట గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్లు బుధవారం పరిశీలించారు. గ్రామంలో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. గుండ్లకుంటలో చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణాన్ని పరిశీలించారు. ఆంజనేయస్వామి గుడి, శివుని గుడికి వెళ్లే దారి విస్తరణకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. రోడ్డు పెద్దగా చేస్తే రాకపోకలు సాగించడానికి సులభంగా ఉంటుందన్నారు. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో సీసీ రోడ్ల నిర్మాణ పనులతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


