తాండూరు టౌన్: తాండూరు ప్రాంత సంస్కృతి, వైభవం, చారిత్రక ఆనవాళ్లపై పట్టణానికి చెందిన కవి గాజుల పవన్ కుమార్ రాసిన ‘రాళ్లను ఈనుతున్న నేల’ పుస్తకాన్ని ఆదివారం కట్టమైసమ్మ దేవాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వరలక్ష్మి మాట్లాడుతూ.. మాతృభూమి వైభవాన్ని అవలోకనం చేసుకుని గ్రంథం రాయడం అభినందనీయమన్నారు. కవులు సీహెచ్ నారాయణ రెడ్డి, మడపతి సిద్ధి లింగయ్య, ద్యావరి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు పుడమి గర్భంలోని గనుల చరిత్ర, పరవళ్లు తొక్కే కాగ్నానది ప్రవాహ తీరు, కమ్మదనాన్నిచ్చే కందిపప్పు, పలు గ్రామాల్లోని చారిత్రక కట్టడాలు, ఆలయాల ప్రత్యేకతను కవి చెప్పిన విధానం చాలా బాగుందన్నారు. ఈ ప్రాంత ప్రత్యేకత, గొప్పదనాన్ని పుస్తక రూపంలో చాటి చెప్పారని కొనియాడారు. గ్రంథానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నర్సింహ్మారెడ్డి, రచయిత దోరవేటి ముందుమాట రాశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఊరిని ప్రేమించే తత్వం పుస్తకంలో కనపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు కోస్గి తిప్పయ్య, వియ్కుమార్, నరహరి తదితరులు పాల్గొన్నారు.


