● జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ దాటిన ఉష్ణోగ్రతలు
తాండూరు: భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేడి గాలులతో సతమతమవుతున్నారు. వారం రోజులుగా ఆరెంజ్ అలర్ట్లో ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం రెడ్ జోన్కు చేరాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దుద్యాల్ మండలంలో 40 డిగ్రీలు, కొడంగల్ మండలంలో 39.9 డిగ్రీలు, యాలాల మండలంలో 39 డిగ్రీలు, దౌల్తాబాద్ మండలంలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో డిగ్రీ దాటితో జిల్లాలో రెడ్ అలర్ట్ జోన్ పరిధిలోకి వెళ్ల నున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉపాధి కూలీలు ఉదయం మాత్రమే పనులు చేయాలని ఎండ తీవ్రత పెరిగిన వెంటనే ఆపేయాలని సూచించారు.


