తాండూరు: పట్టణ పరిధిలో కొలువుదీరిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త సడ్గి భద్రణ్ణ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహానికి పల్లకీ సేవ, శోభాయాత్ర నిర్వహించారు. పురంతయ్యల విన్యాసాలు, విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. గాంధీ చౌక్, రాచన్న ఆలయం వరకు పల్లకీ సేవ సాగింది. రాచన్న ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. మున్సిపల్ చైర్మన్ పట్లోళ్ల నీరజ దంపతులు భద్రేశ్వరుడిని దర్శించుకున్నారు. వీరశైవ సమాజం సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. తాండూరు పట్టణ సీఐ పరమేష్ శాంతిభద్రతలను పర్యవేక్షించారు.


