● కబ్జాకు గురవుతున్నప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి
● అధికారులకు బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఫిర్యాదు
తాండూరు: ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కబ్జా కోరుల చేతిలో నుంచి విడిపించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. పట్టణలోని సర్వే నంబర్ 111లో విజయ విద్యాలయానికి కేటాయించిన భూమిని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం ఆర్డీఓ అనితకు ఫిర్యాదు చేశారు. ప్రధాన రోడ్డు పక్కన ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణానికి ఆనుకుని 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అక్రమ కట్టడం వెలుస్తున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికే సదరు సర్వేనంబర్లోని 14.04 ఎకరాల భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. మిగిలిన భూమినైనా రక్షించాలని కోరారు. అక్రమ నిర్మాణాలపై హైకోర్టు స్టే ఉన్నా యథేచ్ఛగా పనులు సాగుతున్నాయని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈర్షద్, జావీద్, యోగానంద్, అనిల్అర్మి ఆర్డీఓకు వివరించారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. అంతకు ముందు, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మధుసూదర్రెడ్డి, తాండూరు తహసీల్దార్ థారాసింగ్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రుద్రుపటేల్, సంతోష్గౌడ్, అనంత్రెడ్డి, ఏజాజ్, రాజు తదితరులు ఉన్నారు.


