● అధికారుల తీరుపై సర్పంచ్ ఆగ్రహం
● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి జోక్యంతో
సద్దుమణిగిన వివాదం
తాండూరు రూరల్: మండల కేంద్రమైన పెద్దేముల్లో బుధవారం శిలాఫలకం పంచాయితీ నెలకొంది. సర్పంచ్ పేరు శిలాఫలకంపై లేకపోవడం గొడవకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం బుద్దారం గ్రామ శివారు నుంచి పెద్దేముల్ తండా కెనాల్ వరకు ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులు రూ.3 కోట్లతో బీటీ రోడ్డు మంజూరైంది. బుధవారం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి చేతుల మీదగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పెద్దేముల్ తండా వద్ద శిలాఫలకం ఏర్పాటు చేశారు. అందులో సర్పంచ్ డీవై చిన్న నర్సింలు పేరు లేకపోవడంతో ఆయన సంబంధిత అధికారుల తీరుపై మండిపడ్డారు. పెద్దేముల్ తండా పెద్దేముల్ జీపీ పరిధిలోకి వస్తోందని.. తన పేరు శిలాఫలకంలో ఎందుకు రాయలేదని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కార్యక్రమాన్ని అడ్డుకుంటానని హెచ్చరించారు. దీంతో అధికారులు మరో శిలాఫలకం ఏర్పాటు చేశారు. అందులో సర్పంచ్ పేరు ఉండేలా చూసుకున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిన్న నర్సింలు అధికారులు తనను అవమానించారని గొడవకు దిగాడు. ఎమ్మెల్యే కల్పించుకొని సర్పంచ్ను సముదాయించారు. భవిష్యత్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.


