ధారూరు: పరిగి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం 2,100 ఎకరాల భూ సేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేడియల్ రోడ్డు ఏర్పాటుకు రైతులు స్వచ్ఛందంగా సహకరించారని గుర్తు చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పేరిట భూములు లాక్కునేందుకు యత్నించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులను నిర్బధించడం సరికాదని మండిపడ్డారు. సోమవారం రాత్రి కాళాపూర్ గ్రామస్తులను నిర్భందించి వదిలిపెట్టారని విమర్శించారు. హైడ్రా, మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ పేరిట భూములను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సీఎం, అతని అనుచరులు భూదందా చేస్తున్నరని మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ నిలిపివేయకుంటే రైతుల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. అనతరం మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. భూ సేకరణ పేరుతో భూములు కొల్లగొట్టి అక్రమంగా డబ్బులు సంపాదించి బీజేపీలో చేరి తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో మోమిన్పేట్ మండలం ఎన్కతలలో 1,100 ఎకరాల భూమి సేకరిచింది ఉన్నదని, అక్కడే కంపెనీలు ఏర్పాటు చేయకుండా భూ సేకరణ ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల నాయకులు వేణుగోపాల్రెడ్డి, సుధాకర్గౌడ్, హఫీజ్, పోటరీ మహేశ్, చిన్నయ్యగౌడ్, జైపాల్రెడ్డి, రహమతుల్లాఖాన్, బాల్రాజ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


