కొడంగల్: సంక్షేమ పథకాలు పేదలకు అందేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని కడా కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన 312 మంది లబ్ధిదారులకు రూ.1.61 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలువురు నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇక మీదట ఎవరైనా పేదలను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్నాయక్, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, దౌల్తాబాద్ తహసీల్దార్ గాయత్రి, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
దౌల్తాబాద్: మండల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం కడా అధికారి వెంకట్రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతిరెడ్డి పంపిణీ చేశారు. 82 మంది లబ్ధిదారులు కల్యాణలక్ష్మి, 62 మంది బాధిత కుటుంబ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గాయత్రి, మండల నాయకులు వెంకట్రావు, వెంకట్రెడ్డి, వీరన్న, రాజశేఖర్రెడ్డి, దస్తప్ప తదితరులున్నారు.
కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి


