కొడంగల్ రూరల్: పట్టణంలోని పశు వైద్యశాలలో గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పశు సంవర్ధక శాఖ ఏడీ నోవా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకూ 5కిలోల చొప్పున పశుగ్రాస విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. 75శాతం సబ్సిడీతో 5 కిలోల బ్యాగుకు రూ.128.75 చెల్లించి తీసుకెళ్లాలని సూచించారు. గడ్డి విత్తనాలు కావాల్సిన రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలతో రావాలన్నారు. కొడంగల్ పశువైద్యశాలలో 300 కేజీల గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
తాండూరు: పట్టణంలో నాన్వెజ్ వ్యర్థాల సేకరణకు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. చికెన్, మటన్, ఫిష్ లాంటి వ్యర్థాల సేకరించి తరలించేందుకు, స్లాటర్ హౌస్ నిర్వహణకు మున్సిపల్ చైర్మన్ పట్లోళ్ల నీరజ ఆధ్వర్యంలో వేలం జరిగింది. పట్టణానికి చెందిన అబ్దుల్ హమీద్ రూ.20 లక్షలకు వేలం దక్కించుకున్నారు. స్లాటర్ హౌస్ను మజిద్ ఖురేషి రూ.64 వేలకు సొంతం చేసుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. వేలం దక్కించుకున్న వారు గడువులోగా డబ్బు చెల్లించాలన్నారు. లేకుంటే వేలం హక్కులను రద్దు చేస్తామని చెప్పారు.
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జీఎస్టీ సంస్కరణల జాతీయ సెమినార్ మంగళవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా ఐసీఎస్ఎస్ఆర్ డైరక్టర్ బి.సుధాకర్రెడ్డి హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొత్త ఆలోచనలు, సంస్కరణలకు దోహదం చేస్తాయన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ పీవీ గీతాలక్ష్మి పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ సదస్సుతో జీఎస్టీ, ఎంఎస్ఎంఈపై లోతైన అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వికసిత్ భారత్ 2047 దిశగా ముఖ్యమైన ముందడుగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా మొత్తం 74 పరిశోధన పత్రాలు ఆమొదం పొందాయి. కార్యక్రమంలో పీఎస్పీకే అసోసియేట్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ బీపీ భరద్వాజ్, శివకుమార్రెడ్డి , తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ.డాక్టర్.కప్ప కొండల్, సుధీర్, మునిస్వామి, ఆడెప్ప, కరీముల్లా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
బంట్వారం: సీఎం రేవంత్రెడ్డి భూ దోపిడీ ఆగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. పరిగి పోలీసులు మంగళవారం ఉదయం ఆయన్ను ముందస్తు అరెస్టు చేసి బంట్వారం ఠాణాకు తీసుకొచ్చి సాయంత్రం ఐదు గంటలకు వదలి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేస్తోందని, ఇది సరికాదని హితవు పలికారు. రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ పాలకులు దోచుకోవడం దాచుకోవడం తప్పా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. పోలీసుల అక్రమ అరెస్టులతో తమ ఉద్యమం ఆగదన్నారు. రైతులకు అండగా నిలబడి మరింతగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.


