పరిగి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబ సభ్యుల కోసమే నయా దందాను తెరమీదకు తెచ్చారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్రావు పర్యటన నేపథ్యంలో మంగళవారం కాళ్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న నరేందర్రెడ్డి పోలీసుల కంట పడకుండా అటవీ ప్రాంతం మీదుగా రైతుల దీక్షా శిబిరానికి చేరుకొని మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇబ్రహీంపట్నంలో ఫార్మాసిటీ కోసం 14వేల ఎకరాలు కేటాయించారని, వాటిని తీసుకోకుండా సీఎం కొత్త దందాకు తెర తీశారని విమర్శించారు. పేదల భూములు లాక్కోవాలని చూస్తే లగచర్ల కంటే పెద్ద పోరాటం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుందన్నారు. పార్టీ లీగల్ సెల్ ద్వారా న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ అన్నదాతలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని పక్కదారి పట్టించేందుకు కుట్ర చేస్తోందన్నారు. రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే వారిపై అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే భూ సేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అనిల్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, ఆంజనేయులు, సురేందర్, రవికుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కుటుంబ సభ్యుల కోసమే భూ దందా
రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి


