తాండూరు టౌన్: రాష్ట్రంలో కొనసాగుతున్నది సీఎం రేవంత్రెడ్డి పాలనా? లేదా రజాకార్ల పాలనా అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ప్రశ్నించారు. మంగళవారం పరిగి నియోజకవర్గంలో భూ బాధిత రైతులను కలిసేందుకు వెళ్తున్న పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి విపక్ష నాయకులందరినీ జైళ్లో పెట్టి నిరంకుశత్వాన్ని ప్రదర్శించిందని, నేడు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం రజాకార్ల తరహాలో నిరంకుశ, నిర్భంధ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించిన నాయకులపై కేసులు పెడుతున్నారన్నారు. భూ నిర్వాసిత రైతులకు మద్దతు పలికేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి, వెంకట్రెడ్డి, జావీద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు.
ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్


