ఎస్పీ స్నేహ మెహ్ర
అనంతగిరి: పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శారీరక ధృఢత్వం, మానసిక వికాసం, క్రమశిక్షణ అత్యంత కీలకమని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. సోమవారం వికారాబాద్లోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏఆర్ పోలీసులకు వార్షిక మొబైలైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏఆర్ సిబ్బంది అత్యవసర సమయాల్లో బందోబస్తు విధులో, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తారని, వారి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్, ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
మానసిక ఆరోగ్యం అత్యంత ప్రధానం
పోలీసులు ప్రశాంత వాతావరణంలో పనిచేయాలని ఎస్పీ స్నేహమెహ్ర సూచించారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని మహావీర్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో పోలీసు అధికారులు, సిబ్బందికి ఒత్తిడి మేనేజ్మెంట్, మానసిక బలం, మానసిక స్థైర్యం అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజ రక్షణలో నిరంతరం ఒత్తిడితో కూడిన విధులు నిర్వహించే పోలీసులు మానసిక ఆరోగ్యం అత్యంత ప్రధానమని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కేవలం శారీరక ధృడత్వం మాత్రమే సరిపోదని, మానసిక స్థైర్యం కూడా ఎంతో కీలకమన్నారు. విధి నిర్వహణలో వచ్చే ఒత్తిడిని అధిగమించి వృత్తిపరమైన బాధ్యతలకు వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను ఎలా కాపాడుకోవాలనే విషయాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ నిపుణులు అశిష్ చౌహాన్, నిదా ఫాతిమా హజరి, ఏఎస్పీ రాములు నాయక్, డీఎస్పీలు జానయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, నర్సింగ్ యాదయ్య, వీరేష్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.


