పహాడీషరీఫ్: పాత కక్షల నేపథ్యంలో తోటి స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. యషాహిన్నగర్ వాదే సాల్హె హీన్ కాలనీకి చెందిన మహ్మద్ సలీం కుమారుడు మహ్మద్ నసీర్ (22) ఎలక్ట్రీషియన్గా పని చేస్తుంటాడు. ఆదివారం రాత్రి నసీర్ స్నేహితులు మహ్మద్ దస్తగిర్, మహ్మద్ సుబాన్ద్దీన్ ఇంటికి వచ్చి దావత్ చేసుకుందామంటూ బయటికి తీసుకెళ్లారు. కాలనీ సమీపంలోని ఓపెన్ స్థలంలో అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో నసీర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని కాలనీకి చెందిన యువకుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించి నసీర్ మెడ, ఛాతి భాగాల్లో కత్తిపోట్లతో పాటు తలపై సిమెంట్ ఇటుకతో మోది హత్య చేసినట్లు గుర్తించారు. క్లూస్ టీంను రప్పించి శాంపిళ్లు సేకరించారు. తాగిన మైకంలో పాత గొడవలను లేవనెత్తుకొని ఈ హత్యోదంతం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మహ్మద్ దస్తగిర్, మహ్మద్ సుబానుద్దీన్, మహ్మద్ ఇలియాస్, మహ్మద్ నదీం ఖాన్లే ఈ హత్యకు పాల్పడ్డారంటూ మృతుడి మేనమామ మహ్మద్ ఆరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


