విరిగిన స్టీరింగ్ రాడ్డు.. తప్పిన ప్రమాదం
యాలాల: ఆర్టీసీ అద్దె బస్సు స్టీరింగ్ రాడ్డు విరడగంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. తాండూరు–మహబూబ్నగర్లో ప్రతి రోజు సర్వీసులు నడిచే ఆర్టీసీ అద్దె బస్సు సుమారు 15 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మార్గమధ్యలో లక్ష్మీనారాయణపూర్ వద్దకు రాగానే స్టీరింగ్ రాడ్డు విరగడంతో డ్రైవర్ బస్సును రోడ్డుపైనే నిలిపివేశాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అదుపుతప్పి
డివైడర్ ఎక్కిన కారు
తాండూరు రూరల్: ఆటోను తప్పించబోయి ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో పెద్దేముల్ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మారేపల్లి రోడ్డు నుంచి తాండూరుకు ఓ కారు వస్తోంది. పెద్దేముల్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతున్నారు.
నచ్చిన పార్టీకి
స్వేచ్ఛగా ఓటేయాలి
పంజగుట్ట: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటర్లను వివిధ రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, క్రైస్తవులు తమకు నచ్చిన పార్టీకి స్వేచ్ఛగా ఓటేయాలని క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కన్వీనర్ జెరూషలేము మత్తయ్య పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీజేపీ హిందూ ఓటర్లను, కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటర్లను మతపరంగా ప్రభావితం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఆదివారంసోమా జిగూడలోని ఫ్రంట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో ఉన్న సుమారు 80 వేల మంది దళిత క్రైస్తవులు, బీసీ, ఓసీ, మైనార్టీ కన్వర్టెడ్, క్యాథలిక్ క్రిస్టియన్ ఓటర్లు రాజకీయ పార్టీల విధానాలను, ఇస్తున్న హామీలను, సంక్షేమ పథకాల అమలు తీరును గమనించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్రైస్తవులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, పాస్టర్లకు జీతాలు, మైనార్టీ ప్రొటెక్షన్ యాక్ట్ వంటి హామీలను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్రాకు బయలుదేరిన యాత్రికులు
శంషాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మరో యాత్రికుల బృందం ఆదివారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉమ్రా యాత్రకు బయలుదేరింది. దాదాపు 60 మంది యాత్రికులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా యాత్రికులకు వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు పుష్పగుచ్చాలు అందజేసి పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. యాత్రను అల్మిజాన్ సంస్థ నిర్వాహకులు ఫయాజ్ అలీ పర్యవేక్షిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి: సబితారెడ్డి
శ్రీనగర్ కాలనీ: గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్రంగా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం చివరిరోజు ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్కాలనీల్లో బీఆర్ఎస్ ర్యాలీ నిర్వహించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్రెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహించారు. మహిళలకు బీఆర్ఎస్ అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చిందని, ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను నిలబెట్టిందని పేర్కొన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే చరిత్ర సృష్టిస్తారని సబితారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కోరారు. ర్యాలీలో మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పలు విమానాలు రద్దు
శంషాబాద్: వివిధ గమ్య స్థానాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మరో మూడు విమానాలు కూడా రద్దయ్యాయి. ఇందులో 6ఈ 2027 ఢిల్లీ నుంచి హైదరాబాద్, జైపూర్ నుంచి హైదరాబాద్ రావల్సిన 6ఈ–816 రెండు విమానాలతో పాటు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన 6ఈ –424 విమానం ఆపరేషనల్ కారణాలతో రద్దు చేసినట్లు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి.
విరిగిన స్టీరింగ్ రాడ్డు.. తప్పిన ప్రమాదం


