
ప్రజా సంక్షేమానికి పెద్దపీట
బంట్వారం: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బంట్వారంలో శనివారం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి, నాయకులు మొగులయ్య, పురుషోత్తంరెడ్డి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: నగరంలోని బేగంపేట్లో గల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం అర్హులైన షెడ్యుల్డ్ కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు జిల్లాకు చెందిన వారై ఉండాలని, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాకు రెండు సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదన్నారు. విద్యార్థులు 01.6.2018 నుంచి 31.05.2019 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. దరఖాస్తు ఫారాలు జిల్లా షెడ్యుల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో పొందవచ్చన్నారు. పూర్తి చేయబడిన దరఖాస్తు ఫారాన్ని సంబంధిత ధ్రువపత్రాలతో ఈ నెల 8వ తేదీ లోపు సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 9573859268లో సంప్రదించాలన్నారు.
కాగ్నా బ్రిడ్జి గుంతకు మరమ్మతులు
యాలాల: మండల పరిధిలోని తాండూరు–కొడంగల్ ప్రధాన మార్గంలో ఉన్న కాగ్నా కొత్త బ్రిడ్జిపై గత వారం ఏర్పడిన గుంతకు మరమ్మతులు పూర్తయ్యాయి. గుంత పడిన ప్రదేశంలో మైక్రో కాంక్రీటుతో ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షణలో మరమ్మతు పనులను శనివారం సాయంత్రం పూర్తి చేశారు. రెండేళ్ల క్రితమే ప్రారంభించిన కొత్త బ్రిడ్జిపై ఏర్పడిన గుంతతో వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై ఏర్పడిన గుంత మరమ్మతు విషయమై ప్రత్యేకంగా మైక్రో కాంక్రీటు పద్ధతిని ఉపయోగించి చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనిని నిర్మాణ సంస్థ రెబ్కాన్కు అప్పగించి చేపట్టినట్లు ఆర్అండ్బీ ఇన్చార్జి డీఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. పది రోజుల్లో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు అవకాశం ఉంటుందని వివరించారు.
పుట్టిన బిడ్డకు
తల్లిపాలు తాగించాలి
వికారాబాద్ సీడీపీఓ వెంకటేశ్వరమ్మ
ధారూరు: బిడ్డ పుట్టిన గంట వ్యవధిలో ముర్రుపాలు తాగించాలని వికారాబాద్ సీడీపీఓ వెంకటేశ్వరమ్మ సూచించారు. ధారూరు, కేరెళ్లి అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం తల్లి పాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ.. తల్లి పాలతో బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. వ్యాధులు రాకుండా బిడ్డను జీవితకాలం కాపాడుతుందన్నారు. తల్లి పాలను బిడ్డకు రెండేళ్ల వరకు కొనసాగించాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. డబ్బా పాలు వద్దు.. తల్లిపాలు ముద్దు అనే నినాదాలు మార్మోగాయి. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అనురాధ, రమాదేవి, అన్నపూర్ణ, అమృతమ్మ, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమానికి పెద్దపీట