
అభివృద్ధి, సంక్షేమం
అప్పులు కడుతూనే సమర్థవంతంగా అమలు
తాండూరు: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పులు కడుతూనే సమర్థవంతంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో రూ.7.32 కోట్ల విలువ చేసే సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని ఖాంజాపూర్ వద్ద స్వాగత ముఖద్వార పనులను ప్రారంభించారు. ఆ తర్వాత జీపీఆర్ గార్డెన్లో నియోజకవర్గంలోని 22,292 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, మంత్రి మాట్లాడారు. తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రోడ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ ప్రతిపాదనలతో తమ వద్దకు వస్తున్నట్లు తెలిపారు. ఆయన చొరవతో జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా అధిక నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే పథకాలు అందుతున్న నవ్వులు ప్రజల్లో కనిపిస్తాయని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 70 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వారిని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెబుతారని హితవు పలికారు. మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తాండూరు అంటే సీఎం జిల్లా అన్నారు. ఇక్కడ మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్ లాంటి పెద్ద నేతలు ఉన్నారని పేర్కొన్నారు. షాబాద్ స్టోన్ అంటే యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. తాండూరు నాపరాతి పరిశ్రమల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రితో మాట్లాడతానని పేర్కొన్నారు. తాండూరు బైపాస్ పనులకు రూ.30 కోట్లతో ప్రతిపాదనలు అందాయన్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి సమర్థులు కాబట్టే గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. సీఎం జిల్లా కావడంతో పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. కోట్పల్లి ప్రాజెక్టుకు రూ.90 కోట్లు మంజూరులో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అంతకుముందు మండలి చీఫ్విప్ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేష్ మహరాజ్, వైశ్య కార్పొరేష్ చైర్పర్సన్ కల్వ సుజాత, కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
యాలాల: మండలంలోని దౌలాపూర్ శివారులో రూ.230 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, రూ.30 కోట్లతో హాజీపూర్, తాండూరు, బెల్కటూరు, నారాయణపూర్, పాషపూర్ గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేపట్టారు. అంతకుముందు జుంటుపల్లి రామస్వామి ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. డిప్యూటీ సీఎం కళాశాల స్నేహితుడు శ్యాంసుందర్రావు ఇంట్లో ఏర్పాటు చేసిన తేనేటీ విందుకు హాజరయ్యారు. కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, సొసైటీ చైర్మన్ సురేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజేందర్రెడ్డి, హన్మంతు, అక్బర్బాబా, భీమ ప్ప, ఖాసీం, నాగప్ప, హాజీపూర్ మాజీ సర్పంచ్ బాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు
సీఎం రేవంత్రెడ్డి సమర్థతతో ప్రగతి వైపు అడుగులు
డిప్యూటీ సీఎం భట్టి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, స్పీకర్ ప్రసాద్కుమార్
తాండూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
స్నేహితుడి ఇంట్లో భోజనం
తాండూరు రూరల్: తాండూరు పర్యటనకు వచ్చి న మంత్రి శ్రీధర్బాబు తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన నరేందర్రెడ్డి కుమారుడు శ్రీకాంత్రెడ్డి మంత్రి శ్రీధర్బాబు మంచి స్నేహితులు. ఆయన ఆహ్వానం మేరకు మంత్రి శ్రీధర్బాబు తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మరి కొందరు శ్రీకాంత్రెడ్డి ఇంటికి వెళ్లి భోజనం చేశారు.