
ధృతరాష్ట్ర పాలన బాబు
చంద్రగిరి : రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో సీఎం చంద్రబాబుకు కళ్లకు గంతలు కట్టుకుని రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. మద్యం స్కాం కేసుకు ఎలాంటి సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా గురువారం సాయంత్రం స్థానిక చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నల్లజెండాలతో నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి హాజరయ్యారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా నినాదాలు చేశారు.
ముమ్మాటికి వేధింపులే..
రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా మద్యం స్కాం పేరుతో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ను ఈ కేసులో ఏ–39గా పేర్కొనడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ నేతను విడుదల చేసే వరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై ప్రజాగ్రహం నల్లజెండాలతో చంద్రగిరిలో నిరసన లిక్కర్ అక్రమ కేసుపై ఆవేదన నిరసనలో పాల్గొన్న చెవిరెడ్డి లక్ష్మి