
5వ తరగతి విద్యార్థి అంజలి రాసిన ఉత్తరమే స్ఫూర్తిగా..
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ విద్యా సంస్థలకు అమలు చేయనున్న ఉచిత విద్యుత్ పథకం.. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ప్రాథమిక పాఠశాల నుంచి శనివారం ప్రారంభం కానుంది. ఈ స్కూల్లో 5వ తరగతి విద్యార్థిని ఎన్.అంజలి ‘ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నా మనవి’అంటూ 9 డిసెంబర్ 2023న ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరం ఇందుకు స్ఫూర్తిగా నిలిచింది. 23 జూలై 2024న అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తామని సర్కారు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖల విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేసింది.
నా ఆశయం నెరవేరింది
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని నేను గతేడాది డిసెంబర్ నెలలో మా ఉపాధ్యాయుల సహకారంతో ముఖ్యమంత్రికి లేఖ రాశా. దీనిపై స్పందించిన ప్రభుత్వం సానుకూల ప్రకటనతోపాటు అమలు చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నా. – ఎన్.అంజలి, విద్యార్థిని, ఆదిబట్ల