
సాక్షి, హైదరాబాద్: పుస్తకాలు జ్ఞానాన్ని వెలిగించే దీపాలని, జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి పుస్తక ప్రదర్శనలు దోహదపడాలని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వచ్చే నెల 18 నుంచి 27 వరకు హైదరాబాద్లో జరగనున్న బుక్ఫెయిర్ను ఘనంగా నిర్వహించాలని సూచించారు. శనివారం మంత్రి తన నివాస ప్రాంగణంలో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రభుత్వం పుస్తక ప్రదర్శనకు అన్ని రకాల అండదండలను అందిస్తూ వస్తోందని తెలిపారు.
ప్రముఖ నటుడు, సామాజిక చిత్రాల నిర్మాత ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పుస్తక ప్రియులు హాజరుకావాలని, ఇది అతిపెద్ద పుస్తక పండగలా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత హైదరాబాద్ బుక్ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, శరత్ పాల్గొన్నారు.