తొలి విడతగా రూ.3,446 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు యాసంగి సీజన్లో ఆర్థిక ఊరట కల్పించే రైతు భరోసా పథకం కింద తొలి విడత పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు నిధులను విడుదల చేశారు. సోమవారం ప్రతి రైతుకు రూ.6 వేల సాయం (ఒక ఎకరానికి) అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 68,89,955 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొత్తం 57.44 లక్షల ఎకరాలకు గాను రూ.3,446.94 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రంలో సాగు చేసే రైతులందరికీ ఎన్ని ఎకరాలున్నాయనే దానితో నిమిత్తం లేకుండా ఒక్క ఎకరం లోపు భూమికి మాత్రమే ఈ తొలి విడతలో సాయం జమ అవుతుంది. రెండు, మూడు విడతల్లో మిగతా భూమి ఎంత ఉంటే అంతకు రైతు భరోసా సాయం అందజేస్తారు. ఈ సీజన్లో రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో మొత్తం రూ.9 వేల కోట్లు 45 రోజుల్లో జమ చేస్తామని సీఎం చెప్పారు. ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు ఉపయోగ పడేలా నిధులు అందడం వల్ల రైతులకు కొంత ఊరట లభించనుంది.


