భూభారతిలో ‘డిజిటల్‌’ సమస్య | Technical issues on Bhubharati portal in Telangana | Sakshi
Sakshi News home page

భూభారతిలో ‘డిజిటల్‌’ సమస్య

Jun 28 2025 3:35 AM | Updated on Jun 28 2025 3:35 AM

Technical issues on Bhubharati portal in Telangana

సిబ్బంది అవగాహనలేమితో కొత్త ఇబ్బందులు 

డిజిటల్‌ సంతకాలు చేసే విషయంలో గందరగోళం  

పాత పట్టాదారు పేరు మీదనే డిజిటల్‌ సంతకాలు వస్తున్న వైనం 

ఐదు రోజులుగా నెమ్మదిగా సాగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 

నాలుగు రోజుల్లో సర్దుకుంటుందంటున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: భూభారతి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ప్రారంభమయ్యాయి. వీటికి తోడు కొన్ని సమస్యలకు పరిష్కారం చూపడంలో సిబ్బంది అవగాహన లేమి ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. వ్యవసాయ భూములపై కోర్టులు ఇచ్చే తీర్పులు అమలుచేసే సమయంలో ఎంచుకోవాల్సిన ఆప్షన్ల విషయంలో కొందరు రెవెన్యూ అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో కొత్తగా దరఖాస్తు చేసినా పాత పట్టాదారు పేరు మీదనే డిజిటల్‌ సంతకాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా తహసీల్దార్ల డిజిటల్‌ సంతకం వరకు సాఫీగానే సాగుతోందని, ఆ తర్వాత జరగాల్సిన అప్‌డేషన్‌ జరగడం లేదని సమాచారం.

రికార్డుల్లో పేరు మార్పు జరగడం లేదని చాలా కాలంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అయితే, ఈ కోర్టు కేసుల అమలు విషయంలో డిజిటల్‌ సంతకాలు చేసే సమయంలో ఆర్డీఓలు ఆప్షన్‌ ఎంచుకోవాల్సి ఉంటుందని, పట్టాదారు మారుతున్నాడనే ఆప్షన్‌ను ఎంచుకుంటేనే కొత్త పట్టాదారుకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం వస్తుందని, లేదంటే పాత పట్టాదారు పేరు మీదనే ప్రక్రియ పూర్తయినట్టు చూపిస్తోందని సమాచారం.

ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన భూభారతి సదస్సుల్లో 20 వేలకు పైగా కోర్టు కేసులు/పెండింగ్‌ మ్యుటేషన్‌ దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. కోర్టు కేసులను పరిష్కరించే లాగిన్‌ ఉన్న ఆర్డీఓలు డిజిటల్‌ సంతకాలు చేసే సమయంలో ఆప్షన్లను సరిగా ఎంచుకోవాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.  

నెమ్మదిగా రిజిస్ట్రేషన్లు.. 
గత ఐదు రోజులుగా భూభారతి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా జరుగుతున్నాయి. స్లాట్‌ బుకింగ్‌ సవ్యంగానే జరుగుతున్నా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు సర్వర్‌ నెమ్మదిగా సాగుతోందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. డిజిటల్‌ సంతకాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసే సమయంలో ఎక్కువ సమయం తీసుకుంటోందని.. దీంతో 15–20 నిమిషాల్లో పూర్తయ్యే ప్రక్రియకు 40–45 నిమిషాలు పడుతోందని చెబుతున్నారు.

ఈ విషయంపై హైదరాబాద్‌లోని మెయిన్‌ సర్వర్‌ కార్యాలయాన్ని సంప్రదించగా సాంకేతిక సమస్య ఉందని, నాలుగైదు రోజుల్లో సర్దుకుంటుందని చెబుతున్నారు. పోర్టల్‌ అప్‌డేట్‌ అవుతున్న సందర్భంలో కొన్ని సమస్యలు వస్తాయని, వాటంతట అవే సర్దుకుంటాయని చెబుతున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement