breaking news
digital signatures
-
భూభారతిలో ‘డిజిటల్’ సమస్య
సాక్షి, హైదరాబాద్: భూభారతి పోర్టల్లో సాంకేతిక సమస్యలు ప్రారంభమయ్యాయి. వీటికి తోడు కొన్ని సమస్యలకు పరిష్కారం చూపడంలో సిబ్బంది అవగాహన లేమి ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. వ్యవసాయ భూములపై కోర్టులు ఇచ్చే తీర్పులు అమలుచేసే సమయంలో ఎంచుకోవాల్సిన ఆప్షన్ల విషయంలో కొందరు రెవెన్యూ అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో కొత్తగా దరఖాస్తు చేసినా పాత పట్టాదారు పేరు మీదనే డిజిటల్ సంతకాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా తహసీల్దార్ల డిజిటల్ సంతకం వరకు సాఫీగానే సాగుతోందని, ఆ తర్వాత జరగాల్సిన అప్డేషన్ జరగడం లేదని సమాచారం.రికార్డుల్లో పేరు మార్పు జరగడం లేదని చాలా కాలంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అయితే, ఈ కోర్టు కేసుల అమలు విషయంలో డిజిటల్ సంతకాలు చేసే సమయంలో ఆర్డీఓలు ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుందని, పట్టాదారు మారుతున్నాడనే ఆప్షన్ను ఎంచుకుంటేనే కొత్త పట్టాదారుకు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్కు అవకాశం వస్తుందని, లేదంటే పాత పట్టాదారు పేరు మీదనే ప్రక్రియ పూర్తయినట్టు చూపిస్తోందని సమాచారం.ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన భూభారతి సదస్సుల్లో 20 వేలకు పైగా కోర్టు కేసులు/పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. కోర్టు కేసులను పరిష్కరించే లాగిన్ ఉన్న ఆర్డీఓలు డిజిటల్ సంతకాలు చేసే సమయంలో ఆప్షన్లను సరిగా ఎంచుకోవాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. నెమ్మదిగా రిజిస్ట్రేషన్లు.. గత ఐదు రోజులుగా భూభారతి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా జరుగుతున్నాయి. స్లాట్ బుకింగ్ సవ్యంగానే జరుగుతున్నా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు సర్వర్ నెమ్మదిగా సాగుతోందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. డిజిటల్ సంతకాలు, డాక్యుమెంట్లు అప్లోడ్ చేసే సమయంలో ఎక్కువ సమయం తీసుకుంటోందని.. దీంతో 15–20 నిమిషాల్లో పూర్తయ్యే ప్రక్రియకు 40–45 నిమిషాలు పడుతోందని చెబుతున్నారు.ఈ విషయంపై హైదరాబాద్లోని మెయిన్ సర్వర్ కార్యాలయాన్ని సంప్రదించగా సాంకేతిక సమస్య ఉందని, నాలుగైదు రోజుల్లో సర్దుకుంటుందని చెబుతున్నారు. పోర్టల్ అప్డేట్ అవుతున్న సందర్భంలో కొన్ని సమస్యలు వస్తాయని, వాటంతట అవే సర్దుకుంటాయని చెబుతున్నట్లు సమాచారం. -
ఎండలున్నాయి...జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: రైతులకు పాస్పుస్తకాల పంపిణీ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈనెల 10 నుంచి చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని ఎండల్లో చేపట్టవద్దని, ఉదయం 7ృ11, సాయంత్రం 5ృ8 గంటల వరకే పాస్పుస్తకాలు పంపిణీ చేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) మంగళవారం జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ నంబర్ లేనప్పటికీ రైతులు ఆధార్ నంబర్ వివరాలు తీసుకువస్తే వారి వ్యవసాయ ఖాతా వివరాలను పరిశీలించి చెక్ ఇచ్చేయాలని, ఆ తర్వాత పాస్పుస్తకాలపై డిజిటల్ సంతకాలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేవలం తప్పుల్లేని పాస్పుస్తకాలను మాత్రమే పంపిణీ చేయాలని, ఏ రైతు పాస్పుస్తకం ఆ రైతుకు మాత్రమే ఇవ్వాలన్నారు. పాస్పుస్తకం ఇచ్చాక రైతు నుంచి సంతకం లేదా వేలిముద్ర తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లోకి వెళ్లే బృందం టీల్యాండ్ పోర్టల్ నుంచి పహాణీని తీసుకుని వెళ్లాలని సూచించారు. -
ఐటీ డిజిటల్ సంతకాలకు కొత్త సాఫ్ట్ వేర్
న్యూఢిల్లీ: డిజిటల్ సంతకాలతో కూడిన ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియ సులభతరంగా ఉండేలా కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్తో ఐటీ రిటర్నులు అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్రస్తుత ఈ-ఫైలింగ్ విధానంలో సమస్యలు తలెత్తుతున్నాయని పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన దరిమిలా కొత్తది రూపొందించినట్లు వివరించింది. లేటెస్టు బ్రౌజర్లు భద్రతాపరమైన కారణాల రీత్యా కొన్ని ప్లగ్ఇన్ లను అనుమతించకపోవడం వల్లే ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో సమస్యలు వస్తున్నాయని సీబీడీటీ పేర్కొంది. గూగుల్ క్రోమ్, మోజిల్లా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ల లేటెస్టు వెర్షన్లలో ఈ-ఫైలింగ్ వెబ్సైటు సరిగ్గా పనిచేయలేకపోతోందని వివరించింది. కొత్తగా రూపొందించిన సాఫ్ట్వేర్ను పన్ను చెల్లింపుదారులు తమ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకుని డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ కోసం ఉపయోగించవచ్చని సీబీడీటీ తెలిపింది. డిజిటల్ సంతకం చట్టం అమల్లో ఉన్న కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో పన్ను రిటర్నుల ఈ-ఫైలింగ్ దాదాపు 27 శాతం ఎగిసింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో మొత్తం 3.09 కోట్ల రిటర్నులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలయ్యాయి.