పనులు ఆపేయండి.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే | Supreme Court stays Kancha Gachibowli land issue | Sakshi
Sakshi News home page

పనులు ఆపేయండి.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే

Apr 4 2025 4:20 AM | Updated on Apr 4 2025 4:20 AM

Supreme Court stays Kancha Gachibowli land issue

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే.. కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం..

వందల ఎకరాల్లో చెట్లను కొట్టేస్తారా? అంత అత్యవసరం ఏమొచ్చింది? 

కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా?..అన్న జస్టిస్‌ గవాయి, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జి 

తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పనులు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం 

తమ ఉత్తర్వుల్లో ఉల్లంఘనలు జరిగితే సీఎస్‌ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని స్పష్టీకరణ 

కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని సందర్శించి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం.. 16కు వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించింది. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 

కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకుండా స్టే విధించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల అంశాన్ని అమికస్‌ క్యూరీ పరమేశ్వర్‌ గురువారం ఉదయం జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జి మసీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 

దీంతో కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం.. వారాంతం సెలవులను సద్విని యోగం చేసుకుని అధికారులు చెట్లను నరికివేయడంలో తొందరపడ్డారని అభిప్రాయపడింది. తక్షణమే ఆ భూములను సందర్శించి మధ్యాహ్నం 3:30 లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. 

తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతను అనుమతించకూడదని సీఎస్‌ను ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ నివేదిక అందిన అనంతరం 3.45 గంటలకు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్, భూముల విషయంలో ఆందోళన చేస్తున్న వారి తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ గోపాల్‌ శంకరనారాయణ్‌ వాదనలు వినిపించారు.  

అటవీ ప్రాంతం కాదు: ప్రభుత్వ న్యాయవాది 
కంచ గచ్చిబౌలిలో ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రదేశం అటవీ ప్రాంతం కాదని, 30 సంవత్సరాలుగా ఆ భూమి వివాదంలో ఉందని గౌరవ్‌ అగర్వాల్‌ చెప్పారు. అటవీ భూమి అని చెప్పేందుకు ఆధారాలు లేవని అన్నారు. దీంతో.. ‘ఒకవేళ అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లను నరికేందుకు అనుమతి తీసుకున్నారా? కేవలం 2, 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్ల నరికివేత తీవ్రమైన అంశం. 

ఎవరు ఏ స్థాయిలో ఉన్నా చట్టానికి అతీతం కాదు.’ అని జస్టిస్‌ గవాయి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో చెట్ల నరికివేతపై దాఖలైన పిటిషన్‌పై ఇప్పటికీ విచారణ జరుగుతోందన్నారు. కాగా.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారని గోపాల్‌ శంకర నారాయణ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  

నెలరోజుల్లో నిపుణుల కమిటీ వేయాలి 
చెట్ల నరికివేతపై హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) సమర్పించిన నివేదికలోని అంశాలపై ధర్మాసనం ది్రగ్బాంతి వ్యక్తం చేసిసింది. ‘పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేసి,  భారీ యంత్రాలను ఉపయోగించి వందలాది ఎకరాలను అస్తవ్యస్తం చేశారు. ఈ విధ్వంసకాండ వల్ల నెమళ్లు, జింకలు ఈ ప్రాంతం నుంచి పారిపోయినట్లు చూపించే చిత్రాలు నివేదికలో ఉన్నాయి. దీనికి తోడు అక్కడ ఒక చెరువు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. 

ఈ రిపోర్టులో పొందుపర్చిన చిత్రాలను ప్రాథమికంగా పరిశీలిస్తే.. ఈ ప్రాంతం అడవి జంతువుల నివాసానికి అనువుగా ఉంది..’ అని ధర్మాసనం పేర్కొంది. అటవీ భూములు గుర్తించడానికి చట్టబద్ధమైన కమిటీలను ఏర్పాటు చేయకపోతే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాల్సివస్తుందంటూ..ఓ కేసులో మార్చి 4న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నామని ధర్మాసనం గుర్తుచేసింది. 

అటవీ భూములను గుర్తించే చట్టబద్ధమైన కసరత్తు ఇంకా ప్రారంభం కానప్పుడు, చెట్లను నరికివేసేందుకు ఉన్న ‘అంత ఆందోళనకరమైన ఆవశ్యకత’ ఏంటి? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో నెలరోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. ఆ కమిటీ ఆరు నెలలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే.. కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని సందర్శించి ఈ నెల 16 లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. 

‘ఆ ప్రాంతంలో చెట్లను తొలగించడం వంటి కార్యకలాపాలను చేట్టపట్టాల్సిన అవసరం ఏంటి? చెట్ల నరికి వేత కోసం అటవీ అధికారుల నుంచి కానీ మరేదైనా స్థానిక చట్టాల కింద కానీ అనుమతులు తీసుకున్నారా? నరికివేసిన చెట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?..’ తదితర ప్రశ్నలకు జవాబులివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement