బోగస్‌ విద్యాసంస్థలపై కఠిన చర్యలు | Strict action against bogus educational institutions | Sakshi
Sakshi News home page

బోగస్‌ విద్యాసంస్థలపై కఠిన చర్యలు

Jun 11 2025 1:08 AM | Updated on Jun 11 2025 1:08 AM

Strict action against bogus educational institutions

ఇంజనీరింగ్‌ కోర్సుల పేరుతో మోసం 

డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలతో లాలూచీ 

నాలుగు సంస్థలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు 

ఇప్పటికే నోటీసులిచ్చాం...ప్రభుత్వం దృష్టికీ తెచ్చాం 

‘సాక్షి’ కథనంతో ప్రభుత్వంలో కదలిక 

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌ : ఇంజనీరింగ్‌ ప్రవేశాలు కల్పిస్తున్న బోగస్‌ విద్యా సంస్థలపై ఉక్కుపాదం మోపుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ సంస్థలతో కుమ్మక్కయిన డీమ్డ్, ప్రైవేట్‌ యూనివర్సిటీలపైనా చర్యలు తప్పవన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ‘నైపుణ్యంగా నయా మోసం’పేరుతో ‘సాక్షి’దినపత్రిక మే 27న ఓ కథనాన్ని ప్రచురించింది. 

అనుమతులు లేని సంస్థలతో కలిసి డీమ్డ్‌ వర్సిటీలు క్లాసులు నిర్వహించడాన్ని వెలుగులోకి తెచి్చంది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాల యం తీవ్రంగా స్పందించింది. వాటిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో మండలి అధికారులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మండలి చైర్మన్‌తో పాటు వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ ఎస్‌కె మహమూద్, ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తం, మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఆ నాలుగు సంస్థలు... 
ఎలాంటి అనుమతి లేని నాలుగు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఏఐ ఎంఎల్‌ సహా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ప్రచారం చేస్తున్నాయని బాలకిష్టారెడ్డి తెలిపారు.  NxtWave,  byeteXl TechEd  ప్రైవేట్‌ లిమిటెడ్,  LEAPSTART  స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ,  Intellipaat స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ సంస్థలు ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నాయని స్పష్టం చేశారు. ఇవి మల్లారెడ్డి, అరోరా, చైతన్య ఇంజనీరింగ్‌ కాలేజీలతో ఒప్పందం చేసుకుంటున్నాయని, అడ్మిషన్లు ఈ కాలేజీల్లో తీసుకొని, క్లాసులు మాత్రం అనుమతి లేని విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇది పూర్తి చట్ట విరుద్ధమన్నారు. 

ఈ సంస్థలకు ఈ నెల 3వ తేదీన నోటీసులు ఇచ్చామని, ఏ విధంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు? అనుమతులు ఏమున్నాయి ? అనే పలు వివరాలు అడిగామని చెప్పారు. ఈ నెల 13వ తేదీనాటికి జవాబు చెప్పమన్నామని తెలిపారు. సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంస్థల్లో విద్యార్థులు చేరొద్దని చెప్పారు. ఈ తరహా కోచింగ్‌ సెంటర్ల వివరాలు కూడా సేకరిస్తున్నామని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.  

వచ్చే నెల ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ 
జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సూచనల మేరకు ఆగస్టు 14 నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో క్లాసులు మొదలవుతాయని చెప్పారు. జోసా కౌన్సెలింగ్‌ రెండో దశ పూర్తయితే సీట్లపై స్పష్టత వస్తుందన్నారు. ఫీజుల నిర్ధారణపై ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉందన్నారు. 

ఇంజనీరింగ్‌ యాజమాన్య కోటాను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు. ఇంజనీరింగ్‌లో సీట్లు ఉన్నాయని, తొందరపడి ప్రైవేటు కాలేజీల్లో డొనేషన్లు కట్టి చేరొద్దని సూచించారు. ఉన్నత విద్యా మండలికి అవసరమైన అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని, దీనికోసం తెలంగాణ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రిఫార్మ్‌ బిల్లును తేవాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చామన్నారు.  

మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాం 
ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లపై అవగాహన కల్పించేందుకు జోసా తరహాలో మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు. దీనికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.విద్యార్థులకు సీట్లపై అవగాహన కల్పించేందుకు, సందేహాల నివృత్తికి కౌన్సెల్‌ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొబైల్‌ ఫోన్‌ నంబర్‌కు విద్యార్థులు ఫోన్‌ చేస్తే అవసరమైనసమాచారం వస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను దిగి్వజయంగా ముగించామని, ఈ నెల 13న రెండో దశ దోస్త్‌ సీట్ల కేటాయింపు ఉంటుందనితెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement