2021 పెండింగ్ వేతన సవరణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
7–8 శాతం ఫిట్మెంట్ ఇచ్చే యోచన
22 నుంచి కార్మికులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో కదలిక
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారిని శాంతింపజేసే ప్రక్రియలో భాగంగా వేతనాలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 2021, 2025కు సంబంధించి వేతన సవరణలు జరగలేదు. ఈ నేపథ్యంలో ఒక విడత వేతన సవరణ జరపాలని.. 7 లేదా 8 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో అధికారులతో ప్రభుత్వం చర్చించినట్లు తెలిసింది. ఆ మేరకు ఫిట్మెంట్ ఇస్తే నెలవారీ అదనపు జీతాల భారం రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్ల మేర ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం.
వాస్తవానికి గతేడాది ఆర్టీసీ నుంచి ప్రభుత్వానికి వేతన సవరణ ప్రతిపాదన అందింది. అప్పుడు కూడా 7 శాతాన్ని ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వం అప్పట్లో దాన్ని పెండింగ్లో ఉంచింది. తాజాగా 5 శాతం, 10 శాతం 15 శాతం అయితే ఎంత భారం పడుతుందన్న వివరాలను కూడా అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. 2017 వేతన సవరణను అప్పట్లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెండింగ్లో పెట్టింది. రెండేళ్లు నిరీక్షించిన కార్మికులు చివరకు సమ్మెకు సిద్ధం కావడంతో ఫిట్మెంట్ ఇవ్వకుండా 16 శాతం మధ్యంతర భృతిని ప్రకటించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు అదే కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మధ్యంతర భృతికి మరో 5 శాతం చేర్చి ఫిట్మెంట్ను ప్రకటించింది. దీంతోపాటు 2015 వేతన సవరణ బకాయిలు రూ. 280 కోట్లు కూడా అందజేసింది. ఇతర కొన్ని బకాయిలు కూడా చెల్లించింది. అలాగే 3,050 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఇంత చేసినా కార్మికులు సమ్మెకు సిద్ధమవడాన్ని ప్రభుత్వం కొంత తీవ్రంగానే పరిగణిస్తోంది. అయినా వేతన సవరణ ద్వారా సమ్మెను నివారించే ప్రయత్నం చేస్తోంది. కార్మిక నేతలతో చర్చించి ఫిట్మెంట్ను 10 శాతం మించకుండా ఖరారు చేయొచ్చన్న భావన వ్యక్తమవుతోంది. మరో వేతన సవరణ కూడా ఉన్నందున దానికి సంబంధించి కూడా ఏదో ఓ హామీ ఉంటుందని కూడా చెబుతున్నారు.


