ప్రయాణికులకు అలర్ట్‌: మిచాంగ్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌.. 142 రైళ్లు రద్దు | South Central Railway Cancels 142 Trains Due To Michaung Cyclone | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు అలర్ట్‌: మిచాంగ్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌.. 142 రైళ్లు రద్దు

Dec 2 2023 8:27 PM | Updated on Dec 2 2023 8:28 PM

South Central Railway Cancels 142 Trains Due To Michaung Cyclone - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిచాంగ్‌ తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విభాగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో దాదాపు 142 రైళ్లను రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వ‌ర‌కూ ఈ రైలు స‌ర్వీసులు ర‌ద్దు చేసినట్టు సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ చెప్పారు.

వివరాల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర అల్ప పీడ‌నం శుక్ర‌వారం వాయుగుండంగా మారి.. ఆదివారానికి తుపానుగా బ‌ల ప‌డ‌నున్నది. ఈ తుఫాన్‌కు మిచౌంగ్ అని భార‌త వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. దీంతో ఆదివారం, సోమ‌వారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలిక‌పాటి జ‌ల్లుల నుంచి మోస్తరు వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది.

ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులను దక్షిణ మ‌ధ్య రైల్వే (ఎస్సీఆర్‌) అల‌ర్ట్ జారీ చేసింది. మిచాంగ్ తుపాన్ తీరాన్ని దాటనున్న నేప‌థ్యంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) ప‌రిధిలో 142 రైళ్లు ర‌ద్దు చేశామ‌ని సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వ‌ర‌కూ ఈ రైలు స‌ర్వీసులు ర‌ద్దు చేశామ‌ని, ప్రయాణికులు గ‌మ‌నించాల‌ని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రాకేశ్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement