Siddipet: Collector To Politician, IAS Venkatrami Reddy Journey - Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ టు పొలిటీషియన్‌.. వెంకట్రామిరెడ్డి జర్నీ

Published Tue, Nov 16 2021 5:20 PM

Siddipet: Collector To Politician, IAS Venkatrami Reddy Journey - Sakshi

సాక్షి, సిద్దిపేట: కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. నాలుగున్నర ఏళ్ల పాటు పాలనాధికారిగా జిల్లాకు సేవలందించి సోమవారం పదవీకి రాజీనామా చేశారు. జిల్లాలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు, సూచనలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల అమలులో తనదైన ముద్ర వేసుకున్నారు. 

►  ఉమ్మడి మెదక్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పని చేసిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి.   

►   ఆ సమయంలోనే  సీఎం దత్తత గ్రామం 
►  ఎర్రవల్లికి ప్రత్యేకాధికారిగా పనిచేశారు.  
►  ఆ గ్రామస్తులతో నిత్యం మాట్లాడుతూ అభివృద్ధికి కావల్సిన పనులపై , సూక్ష్మసేద్యం, పంటకాలనీల ఏర్పాటు, ఇంటింటికీ సోలార్‌ సిస్టం ఇలా సీఎం, మంత్రి  హరీశ్‌రావు సలహాలు సూచనలతో ప్రజలకు అవసరమైన ప్రయోజనాలు చేకురేలా కృషి చేశారు.  
► ముఖ్యమంత్రి తొలిసారిగా ఆ బాధ్యతలు అప్పగించడంతో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి లక్ష్యాలను చేరుకున్నారు.
►  జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన  రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపొచమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌లు, గజ్వేల్, సిద్దిపేట రైల్వేలైన్‌ నిర్మాణాలకు భూసేకరణలో కీలకంగా వ్యవహరించారు. 


కలెక్టరేట్‌  ప్రారంభ సమయంలో వెంకట్రామిరెడ్డిని ఆశీర్వదిస్తున్న సీఎం కేసీఆర్‌(ఫైల్‌) 

► మూడు సాగునీటి ప్రాజెక్టులు, రైల్వేలైన్, గజ్వేల్‌ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ఆయన ఆధ్వర్యంలో జిల్లాలో దాదాపు 50 వేల భూసేకరణ చేశారు. 
► 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి నల్లానీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభించారు. ► నల్లా కనెక్షన్లను వందశాతం త్వరితగతిన అందజేయడంతో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో నిలిచేందుకు ఆయన ఎంతో కృషి చేశారు.  
►  మల్లన్నసాగర్‌లో ముంపు గ్రామాల ప్రజలకు గజ్వేల్‌ సమీపంలోని ముట్రాజ్‌పల్లి ప్రాంతంలో దాదాపు 6,000 వేల కుటుంబాలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.  
►  సీఎం ప్రాతినిథ్యం వహించే జిల్లా కావడంతో జిల్లా అభివృద్ధిని ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి తీసుకువెళ్లే వారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతీసారి కలెక్టర్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసి  ప్రశంసించారు. –డిసెంబర్‌ 20,2020న సిద్దిపేటలోని కేసీఆర్‌ కాలనీలో డబుల్‌ బెడ్‌ రూంల ప్రారంభోత్సవం సమయంలో దండోడు, మొండోడు అని తన పట్టుదల గురించి ప్రశంసించారు. 
►  అలాగే గజ్వేల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ  గజ్వేల్‌కు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అని చెప్పారు. సీఎంకు ఆయన విధేయుడిగా పని చేశారు.  

జిల్లాతో అనుబంధం  
►  2002–04 వరకు మెదక్‌ ఉమ్మడి జిల్లా డ్వామా పీడీగా పని చేశారు. 
►  24, మార్చి 2015 నుంచి 10, అక్టోబర్‌ 2016 వరకు ఉమ్మడి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా  బాధ్యతలు నిర్వహించారు.  
► ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం 11 అక్టోబర్, 2016న  సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.  
►  2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో 8 నెలల పాటు సిరిసిల్ల కలెక్టర్‌గా, తర్వాత సిద్దిపేట కలెక్టర్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో 15 రోజుల పాటు సంగారెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. తర్వాత యథావిధిగా సిద్దిపేట కలెక్టర్‌గా సేవలందించారు.

Advertisement
Advertisement