
ఒక వైపు కన్సల్టెన్సీలు, మరోవైపు ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలు
తక్కువ ఫీజుతో సీటు,హాస్టల్ వసతి అంటూ ఎర
విద్యార్థుల తల్లిదండ్రుల అయోమయం
హలో సార్ గుడ్ మార్నింగ్... మీరు అక్షయ్ పేరెంటేనా? అక్షయ్కు ఎంత ర్యాంకు వచ్చింది?ఏ కోర్సు కోసం ప్లాన్ చేశారు. కన్వీనర్ కోటాలో ఆ కోర్సు సీటు కష్టమే కదా..? బీ కేటగిరి మేనేజ్మెంట్ కోటా కింద వెళ్లకండి. డబ్బులు వృథా చేయవద్దు. మా కాలేజీలో తక్కువ ఫీజులో అదే కోర్సు పూర్తి చేయవచ్చు. ఒకసారి మా కాలేజీ క్యాంపస్ను విజిట్ చేయండి. ఆలస్యం చేయకండి. ఎప్పుడు వస్తారు? రేపు బాబుతో కలిసి వస్తారా? వచ్చేటప్పుడు నా నెంబర్కు కాల్ చేయండి సార్.
సార్, నమస్తే... మాది ఫలనా ఎడ్యుకేషన్ అకాడమీ. మీరు విజయ్ ఫాదరేనా? బీటెక్లో ఏ కోర్సు ప్లాన్ చేశారు. గుజరాత్ టాప్ వన్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. విశాలమైన స్థలం. హాస్టల్ వసతి, తక్కువ ఫీజు, స్కాలర్ షిప్, కోర్సు పూర్తయి తర్వాత మంచి ప్యాకేజీతో ప్లేస్మెంట్ గ్యారంటీ. ఇప్పటికే 30 మందికి అడ్మిషన్లు ఇప్పించాం. కొద్ది సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆసక్తి ఉంటే ఆలస్యం చేయకండి. ఆలోచించి సంప్రదించండి.
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కూడా పూర్తి కావస్తోంది.ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజీలో సీటు వస్తోందన్న ఉహాగానాలు ఉపందుకున్నాయి. గత విద్యా సంవత్సరం వచ్చిన ర్యాంకులను బట్టి అంచనా వేస్తున్నారు. టాప్ 10 నుంచి 20 కాలేజీల్లో సీటు ఆశలు సన్నగిల్లుతున్నాయి. వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, కన్సల్టెన్సీలు నుంచి విద్యార్ధుల తల్లిదండ్రులకు ఫోన్ల తాకిడి పెరిగింది. మరోవైవు డీమ్డ్ వర్సిటీల నుంచి వాట్సాప్, ఎస్ఎంఎస్ మేసేజ్లు విపరీంగా పెరిగిపోతున్నాయి. రోజు వారీగా కనీసం 20 నుంచి 30 నుంచి ఫోన్లు వస్తుండటంతో ర్యాంకులు ఎక్కువ వచ్చిన విద్యార్ధుల తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. స్థానిక కాలేజీలో తమ పిల్లలకు వచ్చిన ర్యాంకుల బట్టి సీటు వస్తుందా? వారి భవిష్యతేంటని ఆందోళన చెందుతున్నారు.
సీఎస్ఈ కోర్సుకు డిమాండ్
మహానగర పరిధిలోని టాప్ 20 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకు డిమాండ్ బాగా పెరిగింది. సీటు కోసం ఎంత ఫీజు అయినా చెల్లించేందుకు తల్లిదండ్రులు సిద్దమవుతున్నారు. డిమాండ్కు తగ్గట్లుగా సీట్లు లేకపోవడంతో, మేనేజ్మెంట్లు సొమ్ము చేసుకుంటున్నాయి. అయితే మేనేజ్మెంట్ కోటాలో సైతం కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల సీట్లకే పోటీ విపరీతంగా కనిపిస్తోంది. వాస్తవంగా మొత్తం సీట్లలో 30 శాతం మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ర్యాంక్ ఆధారంగా కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీట్లను నింపి మిగితా సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లోని సీట్లు టాప్ కాలేజీలలో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు, సెంకడరీ కాలేజీల్లోనూ రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా తీసుకుంటున్నారు.
డీమ్డ్వర్సిటీల తాకిడి..
ప్రై వేటు డీమ్డ్ వర్సిటీలు ఇంజనీరింగ్ (బీటెక్) కోర్సులో అడ్మిషన్ల కోసం పోటీపడుతున్నాయి. తమ పీఆర్ఓలు, కన్సల్టింగ్ ఏజెన్సీల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఫోన్ల, వాట్సాప్, సందేశాల తాకిడి పెరిగింది.ఇప్పటికి వర్సిటీలు ప్రవేశాల కోసం అడ్మిషన్ ప్రకటనలు విడుదల చేసి కోర్సులు, ఫీజులు, ప్లేస్మెంట్ అవకాశాలు వంటి వివరాలతో పాటు వర్సిటీ ప్రాంగణం, సౌకర్యాలు, ల్యాబ్లు, క్రీడా మైదానాలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. తక్కువ ఫీజు, హాస్టల్ వసతి అంటూ గాలం వేస్తున్నాయి.
చదవండి: కొలిక్కిరాని పాలిసెట్.. డేటా రికవరీకి యత్నాలు
అందరికీ సీట్ వస్తుంది..
రాష్ట్రంలో బోలెడన్ని ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి పేర్కొంటోంది. సీట్ల కోసం డొనేషన్ కట్టి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. ప్రైవేటు కాలేజీల్లో బీ–క్యాటగిరీ సీట్ల భర్తీకి ప్రభుత్వం ఇంకా అనుమతించలేదని, నిబంధనలకు వ్యతిరేకంగా ముందే భర్తీ చేస్తే చర్యలు తప్పవని కాలేజీల యాజమాన్యాలను హెచ్చరిస్తోంది. అనుమతి లేని కాలేజీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. హైదరాబాద్ నానక్రాంగూడ , మాదాపూర్,హైటెక్ తదితర ప్రాంతాల్లోని పలు ఇంజినీరంగ్ సంస్థలకు ఏఐసీటీఈ గుర్తింపు లేదని స్పష్టం చేసింది.