ట్రాఫిక్ నిలిపివేత.. హారన్ల మోత
హైదరాబాద్: మండిపోతున్న ఎండలు.. ఆపై మిట్టమధ్యాహ్నం.. ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధగంటకు పైగా వాహనాలను నిలిపివేయటంతో ప్రయాణికుల సహనం నశించింది. కొందరు కార్లలోంచి దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు విషయం ఏంటంటే.. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్వాడలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో పుప్పాలగూడ ఔటర్ టోల్గేట్తో పాటు మైహోం అవతార్ సర్కిల్లోనూ పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు.
పది నిముషాల్లోనే వేలాది వాహనాలు బారులుతీరాయి. అర్ధగంట పాటు నిలిపివేయడంతో కొందరు కార్లలోంచి దిగి వచ్చి వాగ్వాదానికి దిగారు. ‘ముఖ్యమంత్రి అయితే వారంలో మూడు, నాలుగు సార్లు తమను ఇబ్బందులకు గురిచేస్తారా? హెలికాప్టర్లో తిరగమనండి. లేదంటే సామాన్యుడిలా ట్రాఫిక్లో వెళ్లాలని చెప్పండి. మండుతున్న ఎండలో మమ్మల్ని ఇంతసేపు నిల్చోపెడతారా’? అంటూ నిలదీశారు.
అంతలోనే సీఎం కాన్వాయ్ వస్తుండగా ఒక్కసారిగా హారన్లను మోగించి ఆయనకు వినిపించేలా నిరసన తెలిపారు. అనంతరం సీఎం కాన్వాయ్ వెళ్లిపోవటం, ట్రాఫిక్ జాం సమస్య సమసిపోయింది. ఈ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది.


