
ప్రజావాహనాలపై నిఘా కోసం ఆర్టీఏలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు
వాహనాల కదలికలను నమోదు చేసేందుకు ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు
మహిళా ప్రయాణికుల భద్రత కోసం చర్యలు
ఆటోమేటిక్ నంబర్ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా వాహనాలకు చలానాలు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కమాండ్ కంట్రోల్ తరహాలో ఆర్టీఏలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల ప్రజా రవాణా వాహనాల కదలికలను నమోదు చేసేందుకు ఇది దోహదం చేయనుంది. ఖైరతాబాద్లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో ఈ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదించగా.. తాజాగా కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటుపై రవాణాశాఖ దృష్టి సారించింది.
వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా వాహనాల కదలికలను నమోదు చేస్తారు. ఈ వివరాల ఆధారంగా చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణికుల భద్రతకు ప్రమాదం వాటిల్లినట్లు తెలిసినా వెంటనే అప్రమత్తమయ్యేందుకు అవకాశం లభిస్తుంది. ఆర్టీసీ బస్సులతోపాటు, ప్రైవేట్ బస్సులు, వ్యాన్లు, క్యాబ్లు, మ్యాక్సీక్యాబ్లు, మినీబస్సులు తదితర అన్ని కేటగిరీలకు చెందిన వాహనాలను నిఘాచట్రంలోకి తెచ్చేలా ఈ సెంటర్ పని చేస్తుందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రవాణాశాఖలో నమోదైన ప్రతి ప్రజారవాణా వాహనాన్ని ఈజీగా ట్రాక్ చేసేందుకు ఈ సెంటర్ పని చేస్తుందన్నారు. తయారు చేసే సమయంలోనే వాటికి తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయం కలిగిన డివైజ్లను ఏర్పాటు చేయనున్నారు. కొన్ని కేటగిరీలకు చెందిన వాహనాలకు ఈ డివైజ్లు ఉన్నాయి. పాతవాటికి మాత్రం తప్పనిసరిగా ఏర్పాటు చేయనున్నారు.
ప్రమాదకరంగా ప్రయాణం
హైదరాబాద్లోనే 8 వేలకు పైగా ప్రైవేట్ బస్సులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య స్టేజీ క్యారేజీలుగా నడిచే బస్సులతోపాటు నేషనల్ పర్మిట్లపైన టూరిస్టు్ట బస్సులుగా వివిధ రాష్ట్రాలకు మరికొన్ని రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు సైతం కంపెనీల పేరిట నమోదు చేసుకొని ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అలాగే, 1.2 లక్షల క్యాబ్లు, సుమారు 30 వేల మ్యాక్సీక్యాబ్లు, మినీబస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ ప్రైవేట్ వాహనాల్లోనే మహిళా ప్రయాణికుల భద్రత తరచుగా ప్రశ్నార్థకమవుతోంది.
రాత్రివేళల్లో విధులు ముగించుకొని ఇల్లు చేరుకొనేందుకు అనివార్యంగా క్యాబ్లను ఆశ్రయించవలసి వస్తుంది. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాకపోకలు సైతం పెరిగాయి. ఈ క్రమంలోనే డ్రైవర్ల తీరుపట్ల మహిళా ప్రయాణికులు తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సుల్లో డ్రైవర్లు, సిబ్బంది తరచుగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో వెహికల్ ట్రాకింగ్ అనివార్యంగా మారింది.
కెమెరా క్లిక్మంటుంది..
నిబంధనలను ఉల్లంఘించి నడిచే వాహనాలపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు మరో సాంకేతిక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసేందుకు రవాణాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో ఆటోమేటిక్ నంబర్ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఈ కెమెరాలు వాహనాల నంబర్ప్లేట్లను క్లిక్మనిపిస్తాయి. ఈ కెమెరాలను కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేస్తారు. దీంతో సదరు వాహనం ఏ రకమైన నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతోందనేది ఇట్టే తెలిసిపోతుంది. దాని ఆధారంగా వాహన యజమానికి నోటీసులు పంపిస్తారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలను బదిలీ చేయకుండానే నడపడం, వాహనబీమా లేకపోవడం, పర్మిట్ల కాలపరిమితి ముగిసినా పునరుద్ధరించకపోవడం, ఫిట్నెస్ లేకుండా తిరిగే స్కూల్ బస్సులు, వివిధ రకాల వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టేందుకు ఈ కెమెరాలు దోహదం చేస్తాయి. మొదట ప్రయోగాత్మకంగా 30 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.