కర్రెగుట్టలో ఆపరేషన్‌-2 కగార్‌ ప్రారంభం | Operation Kagar: Crpf Forces Massive Operation In Karregutta | Sakshi
Sakshi News home page

కర్రెగుట్టలో ఆపరేషన్‌-2 కగార్‌ ప్రారంభం

Feb 19 2026 9:10 AM | Updated on Feb 19 2026 10:40 AM

Operation Kagar: Crpf Forces Massive Operation In Karregutta

సాక్షి, ఖమ్మం జిల్లా: కర్రెగుట్టలో ఆపరేషన్‌-2 కగార్‌ ప్రారంభమైంది. 5 వేల మంది సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కూంబింగ్‌ చేపట్టారు. మావోయిస్ట్‌ అగ్రనేతలే టార్గెట్‌గా ఆపరేషన్‌-2 కగార్‌ సాగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, సోది కోసం కూంబింగ్ చేపట్టగా.. మరో వైపు లొంగుబాటుకు అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ఇంకా 40 రోజులే ఆపరేషన్‌ కగార్‌ డెడ్‌లైన్‌ మిగిలి ఉంది.

దీంతో కేంద్ర హోంశాఖ మావోయిస్టుల కార్యకలాపాలపై మరింత దృష్టి సారిస్తోంది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సైతం ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీలో ఇంకా కీలకంగా వ్యవహరిస్తున్న నేతల వివరాలపై ఆరా తీస్తోంది. ఆపరేషన్‌ కగార్‌ను 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ అడవులు, మహారాష్ట్ర, ఒడిశా వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది పలువురు కీలక నేతలతో పాటు వందలాది మావోయిస్టులు ఎదురుదాడుల్లో మృతిచెందారు. రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ అగ్రనేత మోస్ట్‌ వాంటెడ్‌, గెరిల్లా దాడుల వ్యూహకర్త మడివి హిడ్మా కూడా మృతి చెందారు.  ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా, ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టు ఉద్యమం బలహీనపడింది.

నక్సలైట్‌ ఉద్యమం ఇప్పటికే చావుదెబ్బ తిన్నదని, దేశవ్యాప్తంగా ఇంకా 300 మంది నక్సల్స్‌ మాత్రమే మిగిలి ఉన్నారని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. వారిలో నలుగురు సీనియర్‌ కమాండర్లున్నట్టు అధికారులు చెబుతున్నారు. వీరందరినీ కూడా మట్టుబెడితే ఈ మార్చి నెలాఖరు నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలన్న లక్ష్యం నెరవేరినట్టేనని అంటున్నారు. సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యులు మిసిర్‌ బెస్రా అలియాస్‌ భాస్కర్, దేవ్‌జీ అలియాస్‌ కుంభా దాదా అలియాస్‌ చేతన్, రామన్న అలియాస్‌ గణపతి అలియాస్‌ లక్ష్మణ్‌ రావు, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సాగర్‌ ఆచూకీ చిక్కలేదు. రాజిరెడ్డి మినహా ముగ్గురు చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులో ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

కర్రెగుట్టలు మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా మారడానికి అక్కడి భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణం. ఇవి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. మావోయిస్టులు ఒక రాష్ట్రంలో ఆపరేషన్ ఎదురైతే వెంటనే మరొక రాష్ట్రం అడవుల్లోకి పారిపోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ గుట్టలు అత్యంత ఎత్తుగా, దట్టమైన చెట్లతో, లోయలతో కూడిన ప్రాంతం. బలగాలు సులభంగా లోపలికి చొచ్చుకుపోవడానికి వీలుండదు. ఈ క్లిష్టమైన భూభాగం గెరిల్లా యుద్ధానికి, అజ్ఞాతంలో ఉండటానికి అనుకూలంగా ఉంటాయి. స్థానికుల సమాచారం మేరకు ఈ గుట్టలపై మావోయిస్టు అగ్రనాయకులకు చెందిన బంకర్లు (భూగర్భ స్థావరాలు) కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement