లక్ష్యానికి ఆమడదూరంలో...
జిల్లాలో ఎస్హెచ్జీల వారీగా మంజూరు చేసిన రుణ వివరాలు
ఈ ఏడాది రూ.1,047.46 కోట్లలో రూ.811.24 కోట్లే పంపిణీ
ప్రభుత్వం ఆదేశించినా క్షేత్రస్థాయిలో కానరాని ఫలితం
అప్పుడప్పుడే.. హడావుడి
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాల సభ్యులు సొంత వ్యాపారంతో ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం రుణాలు అందజేస్తోంది. తద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాక కుటుంబ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, మరికొందరికి ఉపాది కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇలా ఇప్పటికే జిల్లాలోని పలు స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే, ఈ విషయంలో సభ్యులను ప్రోత్సహించడంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు వెనుకబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో అర్హులైన 18,924 మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రుణాలపై ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. సభ్యులు బ్యాంకుల్లో చేస్తున్న పొదుపు ఆధారంగా అవసరమైన రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం నిర్దేశించిన రూ.1,047.46కోట్ల లక్ష్యంలో ఆర్థిక సంవత్సరం ముగిసే దశకు చేరుతున్నా 8,858 సంఘాలకురూ.811.24 కోట్ల రుణాలు ఇవ్వడం గమనార్హం.
మరో 40రోజులే గడువు
ఈ ఏడాది జిల్లాలో 18,924 సంఘాలు బ్యాంక్ లింకేజీ రుణాలకు అర్హత ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. ఆయా సంఘాలకు రూ.1,047.46 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో జిల్లా అధికారులు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని టర్మ్ లోన్, సీసీఎల్ లోన్లు మంజూరు చేయిస్తున్నారు. అయినా ఇప్పటి వరకు 8,858 సంఘాలకు రూ.811.24 కోట్లు రుణాలే ఇవ్వగలిగారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 40 రోజుల గడువు ఉండగా.. ఇప్పటి వరకు 77.45 శాతం లక్ష్యాన్నే చేరడం గమనార్హం. గత రెండు, మూడేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంటున్నా ఈసారి కూడా లక్ష్యం మేర రుణాలు ఇప్పించడంలో అధికారులు విఫలమయ్యారు.
మండలం ఎస్హెచ్జీల రుణం
సంఖ్య (రూ.కోట్లలో)
తిరుమలాయపాలెం 646 56.64
ఎర్రుపాలెం 374 52.05
రఘునాథపాలెం 670 52.16
నేలకొండపల్లి 467 50.19
ముదిగొండ 499 48.41
కూసుమంచి 606 47.76
వేంసూరు 439 42.99
తల్లాడ 436 41.91
చింతకాని 524 41.49
సింగరేణి 442 39.72
పెనుబల్లి 447 38.47
మధిర 404 38.28
ఖమ్మంరూరల్ 334 38.08
కొణిజర్ల 379 36.98
కామేపల్లి 328 35.08
కల్లూరు 348 34.50
వైరా 367 30.03
ఏన్కూరు 347 30.19
బోనకల్ 380 28.96
సత్తుపల్లి 421 27.25
ఎస్హెచ్జీలకు
రుణ పంపిణీలో జాప్యం
ప్రభుత్వం చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల్లో మాత్రమే హడావుడిగా మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేస్తున్న అధికారులు ఆ తర్వాత పూర్తిగా పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కొన్ని సంఘాలకే చెక్కులు మంజూరు చేయించగా, ఆతర్వాత పట్టించుకోలేదని సమాచారం. అంతేకాక ప్రభుత్వానికి గతనెలలో సమర్పించిన నివేదికలో ఎక్కువ రుణాలు ఇచ్చినట్లు పొందుపర్చారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక గత 6వ తేదీకే రుణ మంజూరు లక్ష్యాలను అధిగమించినట్లు చూపించారు.


