సాక్షి, హైదరాబాద్: మరోసారి మహానగరంలో పెట్రోల్ బంకులు ‘డ్రై’ (నిల్వలు లేని)గా మారుతున్నాయి. కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు చూసి వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. చమురు సంస్థలు ఇంధన సరఫరాను గణనీయంగా తగ్గించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సాధారణంగా పెట్రోల్ బంకుల డీలర్లు ముందుగానే నగదు చెల్లించి తమకు కావాల్సిన పరిమాణంలో ఇంధనాన్ని (ఇండెంట్) పొందుతుంటారు. ప్రస్తుతం డీలర్లు నగదు మొత్తాన్ని చెల్లించినప్పటికీ ఇండెంట్లో కనీసం సగం కూడా సరఫరా కాని పరిస్థితి నెలకొంది. చమురు సంస్థల టెర్మినళ్లలో సరిపోను నిల్వలు ఉన్నా.. కఠినమైన కోటాను అమలు చేస్తుండటంతో ప్రైవేటు బంకులతోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జైళ్ల, పౌరసరఫరాల శాఖ బంకులూ రెండు రోజులకోసారి బంకులు ‘డ్రై’ స్థితికి చేరుకుంటున్నాయి.


