ములుగు, సాక్షి: ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ.. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర బుధవారం ప్రారంభమైంది. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు మొదటిరోజు తండోపతండాలుగా తరలి వచ్చారు. రెండో రోజైన ఇవాళ.. మేడారంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. సమ్మక్క తల్లి ఇవాళ గద్దెపై కొలువు దీరింది. సమ్మక్కను ప్రధాని పూజారి ప్రతిష్టించారు. మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు
చిలకల గుట్ట నుంచి సమ్మక్కను మేడారానికి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం. ఇవాళ కుంకుమ భరణి రూపంలో సమక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు. ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలికారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించారు.
మేడారం జన జాతరగా మారింది. గత రాత్రి సారలమ్మతో పాటు సారలమ్మ, పడిగిద్ద రాజు, గోవిందా రాజులు గద్దెపై కొలువుదీరారు. వనదేవతలకు మొక్కు చెల్లించుకునే క్రమంలో.. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన సమక్క-సారలమ్మ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.