హన్మకొండ: ఎల్నినో ప్రభావంతో ఒకవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో సాగునీటి అవసరాలకు రైతులు విద్యుత్ పంపులను విరివిగా నడుపుతున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో గృహ అవసరాలకు అధికంగా విద్యుత్ వాడుతున్నారు. విద్యుత్ వినియోగంతోపాటు డిమాండ్ పెరుగుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిఽధిలో ఈ నెల 25న విద్యుత్ వినియోగం 80,6887 మిలియన్ యూనిట్లు జరగగా, డిమాండ్ 5,622 మెగావాట్లు నమోదైంది.
అధిక వాడకం ఎందుకంటే..?
ఎల్ నినో తీవ్ర ప్రభావంతో ఉమ్మడి వరంగల్జిల్లా అంతటా కరువుఛాయలు నెలకొంటున్నాయి. వర్షాకాలమైనా చినుకు జాడలేదు. ఇటీవల మోస్తరునుంచి తేలికపాటి కురిసిన వర్షాలు మినహా వరదలు పారే భారీ వర్షం ఇప్పటివరకు లేదు. ఫలితంగా జలవనరులు వెలవెలబోతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు లేక నెర్రలు వారుతున్నాయి. వర్షాలు కురుస్తాయనే ఆశతో వరినార్లు పోసుకున్న రైతులు అందుబాటులో ఉన్న భూగర్భజలాలతో పొలం దున్ని నాట్లు వేస్తుడడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. మరోవైపు మెట్ట పంటలు వాడిపోతుండడంతో వాటిని రక్షించేందుకు తడులు ఇస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ పంపుల వినియోగం పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకోవడంతో గృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్థల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు విరివిగా వినియోగిస్తుండడంతో విద్యుత్కు డిమాండ్ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఈ నెలలో 25,917 మిలియన్ యూనిట్ల వినియోగం జరగగా, 1,376 మెగావాట్ల డిమాండ్కు చేరుకుంది.
అమాంతం పెరిగిన విద్యుత్ వాడకం, డిమాండ్
కనుమరుగైన వర్షాలు..
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
వ్యవసాయ మోటార్లు, గృహ అవసరాలకు విరివిగా విద్యుత్ వాడకం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెలలో 24,917 మిలియన్ యూనిట్ల వినియోగం
1376 మెగావాట్లకు పెరిగిన డిమాండ్


